రాజ్యసభలో పోస్టాఫీస్‌ సవరణ బిల్లు

Dec 4,2023 09:04 #Parliament Session
  • లోక్‌సభలో న్యాయవాదుల బిల్లు ఆమోదం
  • లోక్‌సభలో ప్రవేశపెట్టిన తెలంగాణ గిరిజన యూనివర్శిటీ బిల్లు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభలో పోస్టాఫీస్‌ సవరణ బిల్లు, లోక్‌సభలో న్యాయవాదులు సవరణ బిల్లు ఆమోదం పొందాయి. రాజ్యసభలో పోస్టాఫీస్‌ సవరణ బిల్లును కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం ప్రవేశపెట్టారు. దేశంలోని తపాలా కార్యాలయానికి సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడం, సవరించడం, దానితో అనుసంధానించడమే ఈ బిల్లు లక్ష్యమని మంత్రి తెలిపారు. పోస్టాఫీసుల ప్రైవేటీకరణకే ప్రభుత్వం ఇదంతా చేస్తోందని బిల్లుపై జరిగిన చర్చలో పలువురు ఎంపిలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు లోక్‌సభ న్యాయవాద వృత్తిని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టారు. న్యాయవాద వృత్తిని ఒకే చట్టం ద్వారా క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. దేశంలోని న్యాయస్థానాలలో దూషణల పాత్ర ఉండకూడదని పేర్కొన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపిలు సవరణల్లోని లోపాలను ఎత్తి చూపారు.

  • రెండు దశల్లో ఏడేళ్లలో గిరిజన యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన యూనివర్శిటీని రూ.889.07 కోట్లతో రెండు దశల్లో ఏడేళ్లలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈ యూనివర్శిటీ ఉన్నత విద్య నాణ్యతను పెంచుతుందని తెలిపారు. తెలంగాణలోని సమ్మక్క సారక్క సెంట్రల్‌ గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించిన సెంట్రల్‌ యూనివర్శిటీ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రవేశపెట్టారు. వరంగల్‌ జిల్లా ములుగులో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు.

  • శాస్త్రవేత్త స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వాలి

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ అంత్యక్రియలకు కేంద్రప్రభుత్వ ప్రతినిధి ఎవరూ హాజరు కాకపోవడం ఆయనను అగౌరవ పరచడమేనని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపి కె సురేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో స్వామినాథన్‌ విగ్రహాన్ని, సెంట్రల్‌ హాల్‌లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆహార రంగంలో స్వయం .సమృద్ధిని సాధించడంలో ఆయన చేసిన కృషిని గుర్తించాలని, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసిఎఆర్‌)కు ఆయన పేరు మార్చాలని ప్రభుత్వాన్ని సురేష్‌ డిమాండ్‌ చేశారు.

  • ఉత్తరాఖండ్‌ సొరంగం ఘటనపై న్యాయ విచారణ జరపాలి : సిపిఎం

ఉత్తరాఖండ్‌ సొరంగం ఘటనపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం రాజ్యసభ ఎంపి వి.శివదాసన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం రాజ్యసభలో జీరో అవర్‌లో సిపిఎం ఎంపి వి. శివదాసన్‌ ఉత్తరాఖండ్‌లో కూలిన సిల్క్యారా సొరంగం ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరకాశీ సొరంగంలో ప్రవేశ ద్వారం నుండి 200 మీటర్ల దూరంలో నవంబర్‌ 12న కొంత భాగం కూలిపోయి 41 మంది కార్మికులు చిక్కుకున్నారని తెలిపారు. దాదాపు 17 రోజుల పాటు ఆశ, నిరాశ మధ్య కొట్టుమిట్టాడారని, ఎట్టకేలకు రెస్క్యూ టీమ్‌ నవంబర్‌ 28న కార్మికులందరినీ బయటకు తీసిందని తెలిపారు. ఈ సంఘటన చాలా బాధాకరమని అన్నారు. టన్నెలింగ్‌ కంపెనీ అన్ని భద్రతా చర్యలు, నియమాలు, నిబంధనలను ఉల్లంఘించిందని విమర్శించారు. పారదర్శక, న్యాయమైన విచారణ చాలా అవసరమని అన్నారు. సిల్క్యారా ఒక్కటే ఘటన కాదని, ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో ఇంతకు ముందు కూడా జరిగాయని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌ సొరంగాన్ని నిర్మిస్తోందన్నారు.

  • వాయు కాలుష్యంతో 21 లక్షల మరణాలు : ఆప్‌

ఆప్‌కి చెందిన సంత్‌ బల్బీర్‌ సింగ్‌ వాయు కాలుష్య సమస్యను లేవనెత్తారు. వాయు కాలుష్యం కారణంగా ఏటా దాదాపు 21 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. ఏడాదిలో ఢిల్లీలో ఒక రోజు, ముంబాయిలో ఐదు రోజులు, చెన్నైలో 15 రోజులు మాత్రమే గాలి శుభ్రంగా ఉందని సింగ్‌ పేర్కొన్నారు. వాయు కాలుష్యం గురించి చర్చలు వచ్చినప్పుడల్లా, పంజాబ్‌ రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడమే కారణమని అంటున్నారని అన్నారు. పంజాబ్‌లోని రైతులకు కూడా అలా కాల్చడం ఇష్టంలేదని చెప్పారు. వ్యర్థాలు కుళ్లి ఎరువుగా మారేలా చేసే కెమికల్స్‌ను కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే రైతులు వ్యర్థాలను కాల్చాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

➡️