న్యూఢిల్లీ : చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం ఘాటుగా స్పందించింది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అనీల్ మసిహ్ను తీవ్రంగా మందలించింది. పోల్ అధికారి ఎన్నికల ఫలితాలను తప్పు దారి పట్టించారని కోర్టు మండిపడింది. ‘ఎనిమిది చెల్లని ఓట్లు’ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ”అవి తిరిగి లెక్కలోకి తీసుకోబడతాయి. చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయి” అని పేర్కోంది. వాటి ఆధారంగా ఫలితాలు ప్రకటించబడతాయని ఆదేశించింది. దీంతో ఆప్, కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన విజయం లభించనుంది.
బిజెపి మేయర్ మనోజ్ సోన్కర్ విజయం సాధించడానికి మార్గం సుగమం చేసేలా బ్యాలెట్ పత్రాలపై తానే క్రాస్ మార్క్ పెట్టినట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అనీల్ మసిహ్ సుప్రీంకోర్టులో అంగీకరించిన సంగతి తెలిసిందే.