కేసీఆర్‌ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే : వైఎస్‌ షర్మిల

Nov 25,2023 16:15 #tweets, #ys sharmila

హైదరాబాద్‌: కేసీఆర్‌ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆమె ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌, కేసీఆర్‌లపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్‌ .. అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా? నాడు మహానేత వైయస్‌ఆర్‌ రచ్చ బండలో ప్రజల ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించి ప్రజా ప్రభుత్వానికి చిరునామాగా నిలిచారు. క్యాంప్‌ ఆఫీస్‌లోనే ప్రజా దర్బార్‌ పెట్టి ప్రతి సమస్యను వింటే..నేడు కేసీఆర్‌ చేస్తున్నది నియంత పాలన. ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు..దొరకు ఫామ్‌ హౌజ్‌ వైభోగాలు.అధికార మత్తులో మీకు ప్రజా సమస్యలు కనిపిస్తలే.. ఇండ్లు లేక పేదలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే మీకు కళ్లు కనపడతలే. ధరణి సమస్యలపై రైతుల గోడు వినిపించదు.. ఉద్యోగాలు కావాలని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆకలి కేకలు మీ చెవిన పట్టవు.. సర్కారు బడిలో సౌలతులు లేక పేద బిడ్డలు పడుతున్న బాధలు మీకు కానరావు.. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారు. మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే.. ముమ్మాటికి మీరు తెలంగాణ ద్రోహులే’ అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

➡️