ముంబై: ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో రన్వేపై ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్) సీరియస్ అయ్యింది. ఇండిగోకు రూ.1.2 కోట్లు, ఎయిర్పోర్టుకి రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి బిసిఎఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించగా, ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విమానం పక్కనే రన్వేపై కూర్చొని ప్రయాణికులు భోజనాలు చేయడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బిసిఎఎస్ చర్యలకు ఉపక్రమించింది.