‘కాపీ పేస్ట్‌.. హిందీ రుద్దడం’

opposition-parties-on-criminal-bills

క్రిమినల్‌ బిల్లులపై ప్రతిపక్ష ఎంపిల అసమ్మతి పత్రాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులను పరిశీలించేందుకు నియమించిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి ఎనిమిదిమంది ప్రతిపక్ష ఎంపిలు అసమ్మతి నోట్‌లు ఇచ్చారు. కొత్త చట్టాలు ప్రస్తుత చట్టాలకు ‘ఎక్కువగా కాపీ, పేస్ట్‌’ అని పేర్కొన్నారు. హిందీ పేర్లను వ్యతిరేకించారు. సంప్రదింపులు లేకపోవడం, డొమైన్‌ నిపుణుల అభిప్రాయాల వైవిధ్యాన్ని ప్రతిపక్ష ఎంపిలు ప్రశ్నించారు. మూడు కొత్త బిల్లులతో సహా భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)-1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ సాక్ష్యం చట్టం (ఇఎ)-1872 స్థానంలో భారతీయ సాక్ష్యా అధినియం బిల్లు, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి)-1973 స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత బిల్లులను ఆగస్టు 11న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.బిల్లులను 31 మంది సభ్యుల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపారు. అది గత వారం తన నివేదికను ఆమోదించింది. ఈ కమిటీకి బిజెపి ఎంపి బ్రిజ్‌లాల్‌ నేతృత్వం వహించారు. అసమ్మతి నోట్లు ఇచ్చిన ఎనిమిదిమంది ఎంపిలలో కాంగ్రెస్‌ ఎంపి, మాజీ హోం మంత్రి పి చిదంబరం, ఆ పార్టీ ఎంపిలు అధీర్‌ రంజన్‌ చౌదరి, రవ్‌నీత్‌ సింగ్‌, దిగ్విజరు సింగ్‌, డిఎంకె ఎంపిలు ఎన్‌ఆర్‌ ఎలాంగో, దయానిధి మారన్‌, టిఎంసి ఎంపిలు డెరెక్‌ ఓబ్రియన్‌, కకోలి ఘోష్‌ దస్తిదార్‌ ఉన్నారు. మూడు బిల్లులపై చిదంబరం, ఓబ్రియన్‌, ఘోష్‌ దస్తిదార్‌ తన అసమ్మతి నోట్‌లలో అవి ప్రస్తుతం ఉన్న చట్టాలకు ‘బిల్లుల్లో 93 శాతం కాపీ, పేస్ట్‌’ అని పేర్కొన్నారు. తమ అసమ్మతి నోట్‌లో దాదాపు ప్రతిపక్ష ఎంపిలందరూ బిల్లుల హిందీ పేర్లకు వ్యతిరేకంగా రాశారు. బిల్లుల రూపకల్పనలో సరైన సంప్రదింపులు జరగలేదని ప్రతిపక్ష ఎంపిలు అసమ్మతి పత్రాలలో విమర్శించారు.

➡️