ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులపై మోపుతున్న భారాలను, ఫిట్నెస్ సర్టిఫికేట్ల ప్రక్రియ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రెండురోజులపాటు విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేసింది. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని రవాణాశాఖ ద్వారా వాహనదారులపై భారీగా భారాలు వేస్తున్నారు. ఫిట్నెస్( బ్రేక్) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను జిల్లాల వారీగా బడా కంపెనీలకు కట్టపెట్టేందుకు టెండర్లు పిలవడం సిగ్గుచేటు’ అని తీర్మానంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం లంగిపోవడం శోచనీయమని విమర్శించింది. ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి చెల్లించాల్సిన ఫీజులను భారీగా పెంచుతూ ఆదేశాలు ఇవ్వడం గర్హనీయమని పేర్కొంది. దీనివల్ల వాహనదారులపై వెయ్యి కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని తెలిపింది. ఇప్పటికే మోటార్ వాహనాల పన్ను, గ్రీన్ టాక్స్, టోల్ టాక్స్, భారీ పెనాల్టీలతో రవాణా రంగాన్ని, వాహనదారులను దెబ్బతీస్తూ ఇప్పుడు ఫిట్నెస్ పేరుతో 700, 900 రూపాయలు ఉన్న ఫీజులను 12 వేల నుండి 15 వేల రూపాయల వరకు పెంచడం దారుణమని విమర్శించింది. రాష్ట్రంలో ఒక కోటి 46 లక్షల వాహనదారులందరిపై ప్రతి సంవత్సరం ఈ భారం పడుతుందని, ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలు, స్వంత కార్లు, ఇతర రవాణాయేతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అవసరం లేదని, తాజాగా ద్విచక్ర వాహనాలతో సహా అన్ని వాహనాలను సర్టిఫికెట్ల పరిధిలోకి తీసుకురావడం శోచనీయమని తెలిపింది. ద్విచక్ర వాహనాలకు రూ. 800 నుండి 1900 వరకు, ఆటోలు, త్రిచక్ర వాహనాలకు 1,200 నుండి 5,300 రూపాయలు వరకు, కార్లు ఇతర లైట్ వాహనాలపై రూ 1,800 నుండి 9,300, మధ్య స్థాయి వాహనాలపైహొ 1,800 నుండి 12,000, భారీ వాహనాలపై 1800 నుండి 15,000 రూపాయల భారం వేస్తున్నారని తెలిపింది. ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే కాకుండా మరిన్ని రెట్లు అధికంగా వసూలు చేసే ప్రమాదం ఉందన్న ఆందోళనను సిపిఎం వ్యక్తం చేసింది. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల పేరుతో ప్రైవేట్ సంస్థలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల ప్రక్రియ మొత్తాన్ని కట్టబెడుతున్నారని విమర్శించింది. వైసిపి పెద్దలు, ప్రజా ప్రతినిధులు ఈ టెండర్లను దక్కించుకుని, కోట్లాది రూపాయలు సంపాదించడానికి పావులు కదుపుతున్నారని, బినామీ పేర్లతో టెండర్లు దాఖలు చేశారని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతల బినామీలకే టెండర్లు కట్టబెట్టాలని ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, రాబోయే కాలంలో జిల్లాల వారీగా భారీగా ఫీజులు దండుకునే ప్రమాదం ఉందని తెలిపింది, రవాణాశాఖలో అవినీతిని అరికట్టాల్సిన ప్రభుత్వం, అవినీతికి చట్టబద్ధత కల్పిస్తోందని, అవినీతిని వ్యవస్థీకఅతం చేస్తోందని పేర్కొంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్లకు కట్టబెట్టడం వల్ల 400 రూపాయలు ఉన్న ఫీజు మూడు వేల నుండి ఐదువేల రూపాయలు వరకు పెరిగాయని, నియంత్రణ లేకుండా పోయిందని ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం వల్ల రవాణా శాఖ పూర్తిగా నిర్వీర్యం మవుతుందని, జవాబుదారీతనం లేకుండా పోతుందని విమర్శించింది. ప్రైవేట్ సంస్థల దోపిడీకి అడ్డు అదుపు ఉండదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం అని పేరు చెబుతూ’ వాహన శత్రు ‘ప్రభుత్వం లాగా వ్యవహరిస్తోందని, తమిళనాడు, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడానికి అంగీకరించలేదని పేర్కొంది. ఎపిలో వైసిపి ప్రభుత్వం కేంద్రానికి పూర్తిగా లంగిపోయి, వాహనదారులను బలి తీసుకుంటోందని, ఈ టెండర్ల ప్రక్రియనుహొ రద్దు చేయాలని, పాత రేట్లకు ప్రభుత్వమే రవాణా శాఖ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీచేయాలని కోరింది. . ద్విచక్ర, నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలను ఫిట్నెస్ సర్టిఫికెట్ పరిధిలోకి తీసుకురాకుండా నివారించాలని, గతంలో ఉన్న పద్ధతే కొనసాగించాలని, టెండర్లు రద్దు, భారీగా పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చంది. వాహనదారులందరూ ఈఉద్యమంలో కలిసి రావాలని కోరింది.