ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాల్లో 1,625 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 134 మంది (8 శాతం) అభ్యర్థులు మాత్రమే మహిళలు ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో దాదాపు 9 శాతం (726) మంది మహిళలు ఉన్నారు. వీరిలో 78 మంది మాత్రమే 17వ లోక్సభకు ఎన్నికయ్యారు. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మిజోరం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకరు, ఇద్దరు మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి. మరోవైపు, మణిపూర్, నాగాలాండ్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్తో సహా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా బరిలో లేరు. అరుణాచల్ ప్రదేశ్లో ఒక మహిళా అభ్యర్థిని మాత్రమే నిలబెట్టారు. బీహార్ 3, మధ్యప్రదేశ్ 7, మహారాష్ట్ర 7, మేఘాలయ 2, పుదుచ్చేరి 3, రాజస్థాన్ 12, సిక్కిం 1, ఉత్తరప్రదేశ్ 7, ఉత్తరాఖండ్ 4, పశ్చిమ బెంగాల్ 4 మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల మొదటి దశలో తమిళనాడులో అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. అంటే 950 మంది అభ్యర్థుల్లో 76 మంది మహిళలు ఉన్నారని ఈసి డేటా స్పష్టం చేసింది.