మిజోరంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Dec 9,2023 10:27 #installed, #Mizoram, #New government
  • ముఖ్యమంత్రిగా లాల్‌దుహోమా ప్రమాణ స్వీకారం
  • గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల ఎంపికే పూర్తి చేయని బిజెపి

ఐజ్వాల్‌ : మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పిఎం) నాయకులు లాల్‌దుహోమా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కంభంపాటి హరిబాబు లాల్‌దుహోమా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో 11 మంది జెడ్‌పిఎం ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) నాయకులు జోరంతంగా కూడా హాజరయ్యారు. ఎంఎన్‌ఎఫ్‌ శాసనసభా పక్షనేత లాల్‌ చందమా రాల్టేతోసహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకులు లాల్‌ థన్హావ్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల మిజోరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గాను జెడ్‌పిఎం 27 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నెల 5న జరిగిన సమావేశంలో లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా లాల్‌దుహోమాను, ఉప నాయకుడిగా కె.సప్డంగను ఎన్నుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలు గెలుచుకున్న జెడ్‌పిఎం తాజా ఎన్నికల్లో 27 స్థానాలు సాధించింది. ఎంఎన్‌ఎఫ్‌ 10 స్థానాల్లో విజయం సాధించింది.

ఇటీవల మిజోరంతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. మిజోరంలో జెడ్‌పిఎం, తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించిగా, ఈ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. బిజెపి విజయం సాధించిన మిగతా మూడు రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో ఇంకా ముఖ్యమంత్రుల ఎంపికే ప్రారంభం కాలేదు.

➡️