141 మంది ఎంపీల గెంటివేతకు వ్యతిరేకంగా 22న దేశవ్యాప్త నిరసన : ఇండియా ఫోరం పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అన్ని ప్రజాస్వామ్య మర్యాదలను మంటగలుపుతూ పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపిలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేసిన మోడీ ప్రభుత్వ నియంతృత్వ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాపిత నిరసనలకు ఇండియా ఫోరం పిలుపునిచ్చింది. 28 రాజకీయ పార్టీలతో కూడిన ఇండియా ఫోరం నాల్గవ దఫా సమావేశం మంగళ వారం నాడిక్కడి అశోకా హౌటల్‌లో జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎన్‌సిపి నేత శరద్‌ పవర్‌, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, పిడిపి నేత మెహబూబా ముఫ్తీ, శివసేన నేత ఉద్దవ్‌ ఠాక్రే, ఆర్‌ఎల్డీ నేత జయంత్‌ చౌదరి తదితరులు హాజరయ్యారు.

ఎన్నికల తర్వాతే ఏదైనా..

‘ఇండియా’ ఫోరం తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను బరిలో నిలపాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్‌ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆ ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తిరస్కరించారు. ముందు ఎన్‌డిఎను గద్దె దింపి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటమే ‘ఇండియా’ లక్ష్యంగా ఉండాలని, ఆ తర్వాతే ప్రధాని అభ్యర్థిత్వం, ఇతర అంశాలు చూడవచ్చునని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఎంపిల మూకుమ్మడి సస్పెన్షన్‌ను ఖండిస్తూ సమావేశం తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు అన్ని పార్టీల నేతల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు వేగవంతం చేయాలని కూడా నిర్ణయించారు. ప్రధానమంత్రి పదవికి ఏ నాయకుడిని ప్రతిపాదించి ఎన్నికలను ఎదుర్కోకూడదని కూడా నిర్ణయించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాకు సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. ఎన్నికల తరువాత ఫోరమ్‌కి మెజారిటీ వస్తే ఎంపిలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధానిని ఎన్నుకుంటారని అన్నారు. సీట్ల పంపకాలపై మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ”స్థానిక నేతలు మొదటి రౌండ్‌ చర్చలు జరుపుతారు. విభేదాలు అలాగే ఉంటే సీనియర్‌ నేతలు జోక్యం చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ సీట్ల పంపకాల సమస్యలు పరిష్కారమవుతాయి. పంజాబ్‌, ఢిల్లీ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో చూసేందుకు ప్రయత్నిస్తాం. మనం ముందుగా విజేతలుగా రావాలి. మాకు ఎంపిలు లేకపోతే, ప్రధానిని ప్రొజెక్ట్‌ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?” అని అన్నారు.

రాష్ట్ర స్థాయిలో సీట్లు సర్దుబాటు: ఏచూరి

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో పొత్తులు, అవగాహనలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఇది ఖరారు అవుతుందని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించడంతో ప్రజలను సంఘటితం చేస్తామన్నారు.

‘త్వరలో అన్నీ మొదలవుతాయి’: కేజ్రీవాల్‌

ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ”సమావేశం బాగా జరిగింది. ప్రచారం, సీట్ల పంపకం, ప్రతిదీ త్వరలో ప్రారంభమవుతుంది. ఇంకా (కన్వీనర్‌ ఎంపిక కాలేదు)” అని చెప్పారు.

బిజెపిపై సమిష్టిగా పోరాడాలి: డి రాజా

సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ కనీస ఉమ్మడి కార్యక్రమంపై ప్రస్తావన వచ్చిందని, ఇప్పుడు ఎంపిల సస్పెన్షన్‌ అంశం ప్రజాస్వామ్యంపై దాడి, పార్లమెంటరీపై దాడి అని ముందుగా నిర్ణయించామని అన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా నిరసనలు, సామూహిక నిరసనకు పిలుపునిచ్చామన్నారు. సీట్ల పంపకాలను వీలైనంత త్వరగా ముగించి, బిజెపికి వ్యతిరేకంగా గట్టి సమష్టి పోరాటాన్ని సాగించాలని అన్నారు.

➡️