శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.
ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు అనంత్నాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముఫ్తీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె వ్యక్తిగత సిబ్బందిలో ఉన్న పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఆమె ఖానాబాల్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నుండి ఆమె సురక్షితంగా బయటపడ్డారని ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ఎక్స్లో పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఆమెకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.