నారా లోకేష్ విమర్శ
ప్రజాశక్తి-మంగళగిరి : ఆర్థిక నేరాల్లో ఆరితేరిన జగన్ ముఖ్యమంత్రి కావడంతో కొంతమంది పోలీసులు స్మగ్లర్లు, కిడ్నాపర్లు, దొంగలుగా మారుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 22 కిలోల గంజాయితో కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులకు చిక్కడం ఏపీలో పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారిన దుస్థితిని వెల్లడిస్తోందని ఆయన పేర్కొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్ ఖాకీలను ప్రైవేటు ఫ్యాక్షన్ సైన్యాలుగా వాడటంతో వారికీ నేరాలు అలవాటైపోయాయని ఆయన ఆగ్రహించారు. సీఐడీని కిడ్నాప్లు, బెదిరింపులకి పాలకులే వినియోగిస్తుండడంతో తాము ఏం చేసినా అడిగేవారు లేరని పోలీసులు ముఠాలుగా ఏర్పడి స్మగ్లింగ్, కిడ్నాపులకు పాల్పడడం పోలీసు వ్యవస్థ గౌరవాన్ని మంటగలిపిందని పేర్కొన్నారు. కర్నూల్ డీఐజీ ఆఫీసులో ఎస్సైగా పని చేస్తున్న సుజన్ ఓ ముఠాని ఏర్పాటు చేసి ఏపీ సీఐడీ బృందం పేరుతో ఐటీ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ పోలీసులకి చిక్కిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. గంజాయి మాఫియాకి ఏపీ సర్కారు పెద్దల అండదండలున్నాయని తెలిసిన పోలీసులు గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారని ఎద్దేవ చేశారు.