న్యూఢిల్లీ : కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ పి.బి. వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సిజెఐ డివై. చంద్రచూడ్ జస్టిస్ వరాలేతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సిజెఐ సహా 34 మంది న్యాయమూర్తుల ఫుల్ బెంచ్ కొలువుతీరింది. జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ సిటి.రవికుమార్ల తర్వాత జస్టిస్ వరాలే షెడ్యూల్డ్ కమ్యూనిటీకి చెందిన మూడవ సిట్టింగ్ జడ్జి కానున్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బుధవారం కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే. జస్టిస్ వరాలే పేరును ఈనెల ప్రారంభంలో కొలీజియం సిఫారసు చేసింది. ఆయన అత్యంత సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులలో ఒకరు, షెడ్యూల్డ్ కులానికి చెందిన ఏకైక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కొలీజియం తెలిపింది.