వైసీపీలో చేరేందుకు ముద్రగడ సిద్ధం
14వ తేదీన సిఎం జగన్ సమక్షంలో చేరిక
ప్రజాశక్తి – కిర్లంపూడి : మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 14వ తేదీన తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరెందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఎప్పుడు ఏ విషయం చెప్పాలన్న లేఖ విడుదల చేసే ముద్రగడ ఈసారి మాత్రం మీడియాతో ముఖాముఖి మాట్లాడారు. పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. తనకు గాని తన కుమారుడికి గాని ఎటువంటి సీటు అడగలేదని ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరుతున్నానని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ముద్రగడ చేరికతో కొన్ని నియోజకవర్గాల్లోని వైసిపి నేతలు ఆందోళనలో పడ్డారు.