- 86వ నంబర్ జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
- భారీగా ట్రాఫిక్ జామ్
పాట్నా : లోక్సభ ఎన్నికల వేళ బీహార్లో జేడీయూకి చెందిన రాజకీయ నేత సౌరభ్ కుమార్ హత్యకు గురయ్యారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. పాట్నాలోని పున్పున్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారని, సౌరభ్ కుమార్ చనిపోయారని.. అతని స్నేహితుడు మున్మున్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. వివాహ వేడుకకు హాజరయ్యి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పుల ఘటనతో పున్పున్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో నిరసనలు తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో 86వ నంబర్ జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.