న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్ భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో భారత్ ప్రభుత్వం తరపున విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ ఖతార్కి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటికే ఏడుగురు నేవీ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ ఖతార్లో అరెస్టయిన ఎనిమిది మంది భారతీయ పౌరుల్ని విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తున్నదని ప్రకటనలో పేర్కొంది. వీరి విడుదలకు ‘ఎమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఖతార్’ తీసుకున్న నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నామని భారత విదేశీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
కాగా, 2022లో గూఢచర్యం ఆరోపణల కింద ఇండియన్ నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ సిబ్బందిని ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కెప్టెన్ నవతేజ్ సింగ్, సౌరభ్ వశిష్ట్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, విశాఖకు చెందిన సుగుణాకర్ పాకాల, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. గూఢచర్యం ఆరోపణలపై వారిని అరెస్టు చేసిన తర్వాత అక్కడి ప్రాథమిక కోర్టు కేవలం రెండు మూడుసార్లు మాత్రమే వారిని విచారించి మరణశిక్ష విధించింది. వీరిపై విధించిన మరణశిక్షను రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్రంగా కృషి చేసింది. వీరి మరణశిక్షను రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం కోర్టులో అప్పీలు చేసింది. ఈ అప్పీలుపై కోర్టు విచారణ జరిపిన అనంతరం వారి మరణశిక్షను జైలు శిక్షగా మారుస్తూ 2023 డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. జైలు శిక్షపై కూడా అప్పీలు చేసుకునేందుకు కోర్టు అనుమతించడంతో భారత ప్రభుత్వం న్యాయమార్గాల ద్వారా వారి విడుదలకు కృషి చేసింది. భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో… వారిని విడుదల చేసేందుకు ఖతర్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సుమారు 18 నెలల తర్వాత సోమవారం నేవీ మాజీ అధికారులు స్వదేశానికి చేరుకున్నారు.