- సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఐఎస్ఎఫ్ ఏర్పాటు
బీజింగ్ : అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఇమడ్చుకోవడంలో దూసుకుపోతున్న చైనా సైబర్ దాడులను ఎదుర్కోవడంలోనూ ముందడుగు వేసింది. చైనా సైన్యంలో సమాచార సహాయక దళం (ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ – ఐఎస్ఎఫ్) పేరిట ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించారు. సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చైనా అధ్యక్షులు జిన్పింగ్ తెలిపారు. ఐఎస్ఎఫ్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన ప్రసంగిస్తూ ‘ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి వ్యూహాత్మకంగానే కాకుండా కీలక స్తంభంగా ఐఎస్ఎఫ్ నిలవనుంది’ అని ఆయన అన్నారు. చైనా సైన్యంలో అత్యున్నత కమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సిఎంసి) అధిపతిగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) అధినేతగా, చైనా అధ్యక్షులుగా జిన్పింగ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐఎస్ఎఫ్ను ఏర్పాటుచేయాలన్న ప్రధాన నిర్ణయాన్ని బలమైన సైన్యాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరాన్ని దష్టిలో ఉంచుకుని సిపిసి, సిఎంసి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాజకీయ, సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు 2015లో చైనా వ్యూహాత్మక సహాయక దళం (ఎస్ఎస్ఎఫ్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.