నూతన పారిశ్రామిక వాడకు శంఖుస్థాపన

Nov 29,2023 15:51 #East Godavari
industrial corridor inaugurate

ఎమ్ఎస్ఈ – సిడిపి నిధులతో కలవచర్లలో చేపట్టనున్న

మొత్తం 369 యూనిట్స్ రూ.20.64 కోట్లు నిధులతో అంచనా విలువ క్లస్టర్ ఏర్పాటు

– కలెక్టర్ మాధవీలత

– ఎమ్ ఎల్ ఏ జక్కంపూడి రాజా
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ డా కె.మాధవీలత పేర్కొన్నారు. తాడేపల్లి నుంచి ఎమ్ఎస్ఈ – సిడిపి నిధులతో అంచనా విలువ గల రూ.20.64 కోట్లతో కలవచర్లలో చేపట్టనున్న నూతన పారిశ్రామికవాడకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా శంఖుస్థాపన చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి క్లస్టర్ ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఆ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) లిమిటెడ్ కోసం రూ. 2,065 లక్షల అంచనాతో మంజూరు చేయబడిన ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్ట్ కలవచేర్లలో ఏర్పాటు చెయ్యడం జరుగుతోందని అన్నారు.
సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సంబంధిత అంచనా వ్యయంతో ప్రధాన కార్యాలయానికి సమర్పించడం జరిగిందన్నారు. ఏంఎస్ఈ – సిడిపి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ రూ.1050 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం/ ఏపిఐఐసి గ్రాంట్ రూ.1,015 లక్షలతో ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించడం జరిగిందన్నారు. అంతర్గత రహదారులు, మురుగునీరు పారుదల వ్యవస్థ , ముందస్తు నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలియచేశారు.
రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గడిచిన నాలుగున్నర ఏళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత పాలన దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా  సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేసే ఔత్సాహితులను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కలవచర్లలో 104 ఎకరాలు విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు నిధులు సమకూర్చడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా నేడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం చేశారన్నారు. పరిశ్రమల ఏర్పాటు వలన ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదే విధంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కోరుకొండ మండలం రాజవరం గ్రామంలో నిర్మించునున్న  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు వర్చువల్ విధానంలో  శంకుస్థాపన చేయడం జరిగిందని, ఈ కంపెనీలు నిర్మాణం వలన నిరుద్యోగ యువతకు మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయని  శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు,  సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎంపిపి  ఎమ్. వీర్రాజు, జిల్లా పరిశ్రమల అధికారి బి.వేంకటేశ్వరరావు  ఏపి ఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్లు డివిఎస్ఏన్ జ్యోత్స్న దేవి, బి.రాధామణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు, పాల్గొన్నారు.

➡️