– దేశంలో ఎండమావిగా మారిన న్యాయం
ఫీచర్స్ అండ్ పాలిటిక్స్
దేశంలో న్యాయం ఎండమావిగా మారింది. స్వతంత్ర మీడియా తీవ్రమైన వేధింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక పరమైన అవరోధాలు, దొడ్డిదారిలో స్వాధీనాలు, పత్రికాధిపతులను ఏకంగా జైలులో పెట్టడాలు వంటి చర్యలు స్వతంత్ర మీడియా ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రఖ్యాత స్వతంత్ర న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ సంపాదకులు ప్రబీర్ పుర్కాయస్థను జైలుకు పంపిన ఉదంతం భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎంతటి ప్రమాదంలో ఉందో తెలియజేస్తోంది. గతేడాది అక్టోబరు నుండి తీవ్రవాద అభియోగాలపై ఆయనను జైల్లో ఉంచారు. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ మౌనం చాలా ప్రమాదకరం. న్యాయ వ్యవస్థ సమగ్రతను ఇది ప్రశ్నార్థకం చేస్తుంది. మార్చి 26న దాదాపు 600 మంది సీనియర్ న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి ఓ బహిరంగంగా లేఖ రాశారు. ఫిబ్రవరిలో ‘క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్’ సంస్థ నిర్వహించిన మూడు రోజుల సదస్సులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ వారు ఈ లేఖ రాశారు. ‘న్యాయపాలన, నిర్వహణ, పౌర స్వేచ్ఛ, రాజకీయ హక్కులతో కూడిన కేసుల్లో సుప్రీం కోర్టు ధోరణి’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల నుండి సీనియర్, యువ న్యాయవాదులు పలువురు ఈ సెమినార్లో ప్రసంగించారు. ఇటీవల కాలంలో వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడం, నిర్బంధించడం ఎక్కువైపోయిందని, దేశవ్యాపితంగా ఈ ధోరణి కొనసాగుతోందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పైగా బెయిల్ ఇచ్చేందుకు దీర్ఘకాలంగా అమల్లో వున్న నియమ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారన్నారు. న్యూస్క్లిక్పై దాఖలైన కేసే దీనికి తిరుగులేని ఉదాహరణ అని వారు పేర్కొనారు.
పేదలకు, అణచివేతకు గురైన లేదా దోపిడీకి గురయ్యే వర్గాలకు న్యాయం జురిగే పరిస్థితులు లేవు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను న్యాయమూర్తులు ప్రోత్సహించిన రోజుల్లో వారి గొంతులు వినిపించినప్పటికీ ఒక కట్టుబానిసకు గరిష్టంగా లభించేది స్వేచ్ఛ మాత్రమే, అంతేకానీ ప్రత్యామ్నాయ ఉపాధి కాదు, వేతనాలు కాదు, అటువంటప్పుడు అది కచ్ఛితంగా న్యాయం జరిగినట్లు కాదు. మహిళా పోలీసులు నిర్వహించే పోలీసు స్టేషన్లు వున్నా, అక్కడా న్యాయం జరగడం లేదు. మతపరమైన, భాషాపరమైన లేదా జాతి పరమైన మైనారిటీలు భారతదేశంలో రానురాను ఏకాకులుగా మిగిలిపోతున్నారు.
ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ తీరుతెన్నులు ఇలా వున్నాయి. న్యూస్క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ కేసు విషయానికి వస్తే ఎవరో వేసిన నిందలకు ఒకరోజు ఉదయమే ఆయన్ను అరెస్టు చేశారు. 2021 ఫిబ్రవరిలో ఒకరోజు 8 మంది వ్యక్తులు పుర్కాయస్థ ఇంటికి వచ్చి 113 గంటలపాటు ఇంట్లోనే వుండి ప్రతి మూలా వెతికారు, వారేమనుకున్నారో అవైతే కనబడలేదు. కానీ చిట్టచివరకు ల్యాప్టాప్, ఏవో కొన్ని ఫైల్స్ తీసుకెళ్లారు. వారికేమీ దొరక్కపోయేసరికి ఆ ఫ్లాట్ను జప్తు చేశారు. పుర్కాయస్థను ఆ ఇంట్లో వుండేందుకు అనుమతించారు. న్యూస్క్లిక్పై దర్యాప్తులో ఐదు సంస్థలు పాల్గంటున్నాయి. 2020 ఆగస్టులో న్యూస్ పోర్టల్పై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆర్బిఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవహారంలో న్యూస్క్లిక్కు క్లీన్చిట్ ఇచ్చింది. అయినా ఇడి మళ్ళీ న్యూస్క్లిక్పై దాడులు చేసింది. మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021 సెప్టెంబరులో ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. తిరిగి 2023 అక్టోబరు 3న స్పెషల్ సెల్కు చెందిన 500 మంది సిబ్బంది న్యూస్క్లిక్లో పనిచేస్తున్న దాదాపు 90 మంది జర్నలిస్టులపై దాడి చేశారు. వారి నుండి 250కి పైగా ఎలక్ట్రానిక్ పరికరాలను, ఫోన్లను, హార్డ్ డిస్క్లను, ల్యాప్టాప్లను, పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఆ నెల్లోనే చివరిలో సిబిఐ న్యూస్క్లిక్ కార్యాలయంపై మరోసారి దాడి చేసింది. తొలి రోజు నుండి న్యూస్క్లిక్ ఈ దాడులు, కేసుల వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూనే వుంది. న్యూస్క్లిక్ కార్యాలయాలు, అందులో పనిచేసే వారి నివాసాలు, ఆఫీసులపై దాడి చేసినా, అన్ని ఫైళ్ళు, ఖాతాలు అందుబాటులోకి తెచ్చుకున్నా గత రెండేళ్ల నుండి న్యూస్క్లిక్పై ఒక్క ఫిర్యాదును ఇడి ఇవ్వలేకపోవడాన్ని న్యూస్క్లిక్ ప్రశ్నిస్తోంది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఇంతవరకు చార్జిషీట్ను దాఖలు చేయలేకపోయింది. ఆదాయపుపన్ను శాఖ తన చర్యలను కోర్టులో సమర్ధించుకోలేకపోయింది. నిజానికి ప్రభుత్వం వద్దనే ఎలాంటి స్పష్టమైన ఆరోపణలు, అభియోగాలు లేవు. అయినా సిబిఐ మరోసారి ఎఫ్ఆఐర్ నమోదు చేయడం చూస్తుంటే స్వతంత్ర మీడియా సంస్థగా న్యూస్క్లిక్ను పనిచేయనివ్వకుండా వేధించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.
ఏదేమైనా భారత ప్రజాస్వామ్యాన్ని, అందులో అంతర్భాగంగా వున్న క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను పరిరక్షించాలనుకునే మనలాంటి వారందరికీ న్యూస్క్లిక్ కేసు చాలా ముఖ్యమైనది. ఈ కేసులో ప్రబీర్ పుర్కాయస్థ, న్యూస్క్లిక్లకు న్యాయం చేకూరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.