ప్రజాశక్తి ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు విజయవాడ ధర్నాకు వెళ్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం పాలకొల్లు రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండల ఆశా వర్కర్ల మండల కార్యదర్శి నక్క శైలజ అన్నారు. గురువారం ఉదయం పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి ఆచంట మండలానికి చెందిన పదిమంది ఆశా వర్కర్లను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించరాదని ఆయన అన్నారు. ఆశా వర్కర్లకు రూపు పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రు 5 లక్షలు ఇవ్వాలని, డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నక్క శైలజ, జి గంగాభవాని, బి మీనా కుమారి, బి లక్ష్మీ కుమారి, కే విజయలక్ష్మి, ఏ అనిత కుమారి కే సుజ్ఞాన కుమారి, వి ధనలక్ష్మి, యూ రూతు, జి అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.