- నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను సిఎం రేవంత్ రెడ్డి నేడు అందజేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ఆర్పీబీ) అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్లో తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. పోలీస్, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగాలకు సంబంధించిన 16,604 పోస్టులకు 12,866 మంది పురుషులు, 2884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అర్హత లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్లాగ్గా పరిగణిస్తారు. పోలీస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 100 డ్రైవర్ పోస్టులు, అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలు కోర్టు కేసుల కారణంగా వెల్లడి కాని విషయం తెలిసిందే..