బాలికపై సామూహిక అత్యాచారం

Apr 16,2024 21:49 #Gang Rape, #Krishna district

ప్రజాశక్తి – అవనిగడ్డ (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణం చోటుచేసుకుంది. కబడ్డీ క్రీడలో మెలకువలు నేర్పుతామని చెప్పి ఓ దళిత బాలికపై ముగ్గురు దండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. అవనిగడ్డ 8వ వార్డుకు చెందిన బాలిక (16) ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. కబడ్డీపై మక్కువతో ప్రాక్టీస్‌ చేస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆటల్లో శిక్షణ ఇచ్చే పేరుతో అవనిగడ్డకు చెందిన తోకల పవన్‌ కుమార్‌ (ఆర్నాల్డ్‌), డోజేంద్ర విష్ణు, పడమటి కొండలరావు ఆ బాలికకు మాయమాటలు చెప్పారు. ఆమెను గదికి తీసుకెళ్లి మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం సమయంలో వీడియోలు తీసి ఎవరికైనా చెబితే వీటిని బయటపెడతామని బాలికను భయపెట్టారు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లి దృష్టికి తీసుకెళ్లింది. బాలిక కుటుంబ సభ్యులు అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిఎస్‌పి పి.మురళీధర్‌ ఆదేశాల మేరకు సిఐ త్రినాధ్‌, ఎస్‌ఐ రమేష్‌ బాబు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

➡️