విషాదం నింపిన స్నేహితుల సరదా .. ఒకరు సముద్రంలో గల్లంతు..!

Nov 27,2023 13:25 #friends, #Fun, #lost, #one, #sad, #sea

అనకాపల్లి : స్నేహితులంతా సరదాగా బీచ్‌కు వెళ్లారు…. ఇంతలో … రాకాసి అలలు ఎగసిపడ్డాయి.. ముగ్గురు గల్లంతవుతుండగా ఇద్దరు కాపాడబడ్డారు.. మరొకరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటన అనకాపల్లిలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే …. అనకాపల్లి జిల్లా పరవాడ బీసీ కాలనీకి చెందిన రాజేష్‌.. తన స్నేహితులైన మోక్షజ్ఞ, విజరు, కిషోర్‌, కళ్యాణ చక్రవర్తితో కలిసి తంతడి బీచ్‌కు విహారానికి సరదాగా వెళ్లారు. కళ్యాణ్‌ చక్రవర్తి తప్ప మిగిలిన నలుగురు మైనర్లే. అంతా కలిసి బైకులపై బీచ్‌కి వెళ్లారు. అక్కడ కొంతమంది క్రికెట్‌ ఆడుతుండగా, మరి కొంతమంది సముద్రంలో జలకాలాడడానికి వెళ్లారు. రాజేష్‌, మోక్షజ్ఞ, విజరు సముద్రంలో దిగారు. కిషోర్‌, కళ్యాణ్‌ చక్రవర్తి ఒడ్డుపైనే ఉన్నారు. ఎవరి సరదాలో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా భారీ కెరటం వచ్చి రాజేష్‌, మోక్షజ్ఞలను లాక్కెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉండి అప్రమత్తమైన కళ్యాణ్‌ చక్రవర్తి అతి కష్టం మీద మోక్షజ్ఞను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. కానీ రాజేష్‌ను రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కళ్ళముందే రాజేష్‌ కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో స్నేహితులంతా ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు ప్రారంభించారు. సముద్రంలో గల్లంతైన బాలుడు రాజేష్‌ పరవాడ జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి పెయింటర్‌. కొడుకు సముద్రంలో గల్లంతవ్వడంతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

➡️