నీళ్ల కోసం.. నేల కోసం.. మత్స్యకారుల దైన్యం..

Nov 19,2023 07:35 #COVER STORY, #Sneha

మూడొంతుల నీళ్లే ఉన్న భూగోళంపై.. ఆ నీళ్లలోనే బతికే చేపల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి గుర్తుచేసే రోజు. చేపలనే కాదు.. సమస్త జలచరాలను వెంటాడుతున్న మనుగడ ప్రమాదం గురించి మానవాళిని హెచ్చరించే రోజు.. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సంద్రం నిండా కదలాడిన అనేక రకాల చేపలతో పాటు జలచరాలు క్రమేణా మాయమైపోతుంటే.. ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో దిక్కు తెలియక ప్రపంచవ్యాప్తంగా సతమతమవుతున్న మత్స్యకారులకు గళమిచ్చిన రోజు! కడలి అలలపైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు.. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే. ఇంత చేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం, బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతుపట్టని రోజుల తరబడి ప్రయాణం.. అయినా సంద్రంపై నమ్మకంతో బతుకుపోరు సాగిస్తూనే ఉంటారు మత్స్యకారులు.. సముద్రం ఉట్టి చేతులతో పంపదు.. అన్న నానుడిని మననం చేసుకుంటూ, వలలు భుజాన వేసుకుని, తిరిగి వస్తామో రామోనన్న నమ్మకం లేని పయనం చేస్తారు మత్స్యకారులు.. సంద్రంలో ఇప్పుడు కార్పొరేట్‌, కాలుష్య తిమింగలాలు సంద్రాన్ని.. తీరాన్ని.. వీరిని, వీరి బతుకుల్ని కబళించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

2

వివిధ దేశాలకు చెందిన మత్స్యకారుల ప్రతినిధులతో 1997లో తొలిసారిగా వరల్డ్‌ ఫిషరీస్‌ కన్సార్టియమ్‌ ఫోరమ్‌ పేరిట న్యూఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. దాదాపు 18 దేశాల నుండి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో వరల్డ్‌ ఫిషరీస్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్‌) ఆవిర్భవించింది. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సముద్ర పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా, కార్పొరేట్‌ లాభాపేక్షతో అంతరించిపోతున్న మత్స్స సంపదను కాపాడటమే ధ్యేయంగా నవంబర్‌ 21ని మత్స్య దినోత్సవంగా జరపాలని ఆ సమావేశం పిలుపునిచ్చింది. తొలి సమావేశం జరిగి 26 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి సమావేశంలో భాగస్వాములైన మత్స్యకారుల తరం దాదాపుగా దాటిపోయింది. కానీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు.

  • ఉనికికే ప్రమాదం..

ఇప్పుడు జలచరాలకే కాదు.. మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలుష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి, మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఈ దుష్పరిణామానికి కారణమైన కార్పొరేట్లు తీరప్రాంత భూములపై కన్నేశారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలను ప్రభుత్వాల సహకారంతో కబ్జా చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని అన్ని జల వనరులను విషతుల్యంగా మారుస్తున్నారు. సముద్ర సంపదను నిలువునా దోచేస్తున్నారు. జలచరాల గుడ్లను కూడా మిగల్చకుండా ఊడ్చేస్తున్నారు. అందుకే.. మత్స్యకారులు ఇప్పుడు తరతరాలుగా తమకింత నీడనిచ్చిన నేల కోసం, కడుపు నింపే నీళ్ల కోసం పోరాడాల్సి వస్తోంది. ఈ పరిణామాలు మన రాష్ట్రంలోనూ శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా తూర్పుతీరంలోని లక్షలాది మంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి. తీరంతో పాటు సముద్రాన్ని కూడా కార్పొరేట్లకు ప్రభుత్వాలు అప్పచెబుతున్నాయి. సముద్ర జలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలే మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.

3

  • రాష్ట్రంలో ఇలా..

రాష్ట్రానికి సుదీర్ఘమైన 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011 లెక్కల ప్రకారం) సుమారుగా 6.05 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం 12,747 మోటారైజ్డ్‌, 1771 మెకనైజ్డ్‌, 14,677 సాంప్రదాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడిచిన పన్నెండేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకారుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గింది. వాటి స్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. వెజెల్స్‌ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద వ్యాపారవేత్తల నుండి వందల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కారణంగా సాంప్రదాయ బోట్లతో వేట అసాధ్యంగా మారింది. ఎక్కడైతే స్వేచ్ఛగా ఆడుతూ, పాడుతూ జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతుకులీడ్చాల్సిన దుస్థితి మత్స్యకారులకు ఏర్పడుతోంది. గుడ్లను, చేప పిల్లలను వదిలి వేస్తూ సాగే ‘బతుకు.. బతికించు’ జీవన విధానం నుండి ‘సర్వస్వాన్ని దోచేసే’ కొత్త సముద్రపు నీతి పుట్టుకొచ్చింది. ‘కాళ్ళకింద నేలను.. బోటుకింద నీళ్లను..’ లాగేసే ప్రభుత్వ విధానాలు.. తీర ప్రాంతంలో తిష్టవేసి, మత్స్యకారుల బతుకుల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు దయనీయస్థితిలోకి నెట్టబడ్డారు.

TABLE

  •  ఏం జరుగుతోంది…?

నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగుతోంది. సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండటంతో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది. నదుల్లో చేరుతున్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రంలో కలుస్తున్న విషపదార్థాలపై పూర్తిస్థాయి సమాచారం లేదు. రిలయన్స్‌ వంటి సంస్థలు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ నిబంధనలను కాదని, బేఖాతరు చేస్తూ తిష్ట వేసిన తరువాత వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మిగిలిన ప్రపంచానికేమోగానీ స్థానిక మత్స్యకారులకు మాత్రం ఈ వాస్తవం పూర్తిగా అర్థమైంది. ‘ఎవరైనా వస్తున్నారంటే కంపెనీల వాళ్లకి సమాచారం ముందుగానే తెలిసిపోతుంది. జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లు చెప్పడమే కాదు. తీసుకెళ్లి చూపించేస్తారు కూడా.. కానీ సముద్రంలోకి, మా బతుకుల్లోకి విషం మాత్రం చిమ్ముతూనే ఉంటారు. అది తగ్గదు.. పైగా రోజురోజుకీి పెరుగుతూ ఉంటోంది’ అని కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టులో జెట్టి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక మత్స్య కార్మికుడు చెప్పాడు. కాలుష్యం పెరుగుతూనే ఉండటంతో సముద్రంలో మాములుగా దొరికే చేప జాతులు ప్రస్తుతం దొరకడం లేదన్నది ఆయన ఆవేదన. సొంత మెకనైజ్డ్‌ బోటులో మరో ముగ్గురు, నలుగురితో కలిసి వేటకు వెళ్ళే ఆయన ‘కొన్ని సంవత్సరాల క్రితం ఒడ్డునే చేపలు దొరికేవి. ఇప్పుడు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. రోజుల తరబడి సముద్రం మీదనే ఉండాల్సి వస్తోంది. ఇంత చేసినా వేట బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు. ఒక్కోసారి బోటు మీద తీసుకెళ్ళేవారికి రోజుకూలీ కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది’ అని చెప్పారు. ఆయనతో పాటు మరికొందరు చెప్పిన సమాచారం ప్రకారం వందల రకాల సముద్ర జీవజాలం ఉనికి ఇప్పుడు కాకినాడ తీర ప్రాంతంలో కనిపించడం లేదు. వీటిలో ఎక్కువ భాగం చేప జాతులే! వాటి పేర్లు చెప్పమని అడిగితే వారు తడబడకుండా చెబుతున్నారు. కాకినాడలోనే కాదు. బంగాళాఖాతం పొడవునా ఇదే స్థితి!

4

  • కలవరపెడుతున్న కోత!

కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీరప్రాంతంలో కొత్త జీవన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. పిల్లి పిల్లలను మార్చినట్టు సంవత్సరాల కాలంలో తమ నివాస ప్రాంతాలను ఒకచోట నుండి మరోచోటుకు మార్చాల్సి వస్తోంది. అయినా, తరతరాలుగా అలవాటైన సముద్రతీరంలోనే ఎప్పటికప్పుడు మత్స్యకారులు కొత్త నివాసాలను వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోని ఉప్పాడ ప్రాంతం దీనికి పెద్ద ఉదాహరణ. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన 80 సంవత్సరాల కాలంలో ఇక్కడ రెండు కిలోమీటర్ల భూమి కోతకు గురైంది. ఈ ప్రభావం 1989 నుండి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని ఒక అంచనా! ‘ఒకే దగ్గర నివాసం ఉండటమన్నది మరచిపోయాం. మూడు తరాలుగా స్థలాలు మారుస్తూనే ఉన్నాం. మా ముందు తరం వాళ్లున్న ప్రాంతం అదిగో అక్కడ సముద్రంలో ఉంది. గంగను వదిలి ఉండలేంగా.. ఇక్కడే ఉంటున్నాం’ అని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ఇళ్లను కోల్పోయిన వారే అందరూ. కోల్పోకుండా ఉన్నవారు ఒక్కరంటే ఒక్కరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇలా నష్టపోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్నదంతా కోల్పోవడం, కట్టుబట్టలతో మిగలడం వారికి మామూలే. ఉప్పాడలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 294.89 కిలోమీటర్ల భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7 శాతం. దీనిని బట్టే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.

ఏ జిల్లాలో ఎంత కోత?
జిల్లా కోత (కి.మీ.లలో)
శ్రీకాకుళం 25.12
విశాఖపట్నం 25.81
తూర్పుగోదావరి’ 89.25
కృష్ణా 57.55
నెల్లూరు 53.52

తీరం కార్పొరేట్ల పరం..
కాలుష్యం కారణంగా ఇప్పటికే సముద్ర పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అయినా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిణామం మరింత వేగవంతమైంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తీర ప్రాంత అప్పగింత మత్య్స సంపదతో పాటు, మత్స్యకారులకు కూడా శాపంగా మారుతోంది. మన రాష్ట్రంలో అదాని గ్రూపు సంస్థలకు పోర్టుల అప్పగింత కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ కాస్తా అదానిప్రదేశ్‌గా మారుతోంది. పోర్టులను స్వాధీనం చేసుకున్న అదాని సంస్థ సముద్రంలోకి నౌకలకు ఆటంకం కలుగుతోందంటూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై ఆంక్షలు విధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 37 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం అదాని పోర్ట్స్‌ పరిధిలోకి వెళ్లింది. దీనిలో ఇప్పటికే దాదాపు 16 కిలోమీటర్ల మేర కాంపౌండ్‌వాల్‌ను కట్టారు. మిగిలిన గోడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి రాకపోకలకు ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ గోడ నిర్మాణం పట్ల మత్స్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆందోళనలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అదానికే మద్దతుగా నిలిచింది. ఆ సంస్థ చేతుల్లోకే వెళ్లిన గంగవరం పోర్టు వద్ద కూడా ఇదే స్థితి. గోడ నిర్మాణంతో కిలోమీటరు దూరం వెళ్లి, వేటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అదాని గ్రూపు ప్రయతిస్తోంది. పోర్టులే కాకుండా ‘కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లు, సెజ్‌లు, సాగరమాల’ ప్రాజెక్టుల పేరుతో తీరప్రాంత భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, పెట్రో కెమికల్స్‌ ఫార్మా పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దివీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌, రాంకీ ఫార్మ సిటి,హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌లు వీటిలో కొన్ని. వీటి నుండి విడుదలయ్యే కాలుష్యాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దీనిని నియంత్రిస్తున్నట్లు, కాలుష్య నివారణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలు మాటలకే పరిమితం. దీని ప్రభావం మత్య్స సంపదపై పెద్ద ఎత్తున పడుతోంది.

  • సమస్యలు పరిష్కరిస్తేనే బతుకు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు నష్టదాయకమైన జీవోలను విడుదల చేస్తున్నాయని ఎపి మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం పేర్కొంది. దీంతో మత్స్యకార వృత్తికి తీరని అన్యాయం జరుగుతోంది.

  1.  చేపలకు గిట్టుబాటు ధర కల్పించాలి.
  2.  గంపల మహిళలకు మార్కెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలి.
  3.  సబ్సిడీ డీజిల్‌, ఐస్‌ ప్లాంట్‌ వంటి సదుపాయాలు కల్పిస్తామని, జెట్టీలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
  4.  తుపాను సమయాల్లో మత్స్యకారులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి.
  5.  వేట నిషేధ కాలంలో సమస్యలను పరిష్కరించాలి.
  6.  యాభై సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పింఛన్‌ సౌకర్యం కల్పించాలి.
  7.  స్థానిక పరిశ్రమల్లో మత్స్యకార కుటుంబాల యువతకు ఉపాధి కల్పించాలి.

5

 

  • ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి..

ఆక్వా (రొయ్యలు, చేపలు, పీతలు) రైతులు ఇటీవల కాలంలో పీకల లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. సన్న, చిన్నకారు రైతులు కోలుకోలేని దెబ్బ తింటున్నారు. ఫీడ్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫీడ్‌, సీడ్‌ (విత్తనం) నాణ్యతా ప్రమాణాల్లో లోపాలుంటున్నాయి. వైరస్‌లు, వాతావరణ మార్పులు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దిగుబడులు తగిన విధంగా లేవు. ధర రాక ఆక్వా రైతులు కుదేలౌతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల పన్నులు, విదేశీ మారకద్రవ్యం రూపంలో ఆదాయం పొందుతున్నాయి. కానీ ఆక్వా రైతుల్ని మాత్రం గాలికి వదిలేసి, నట్టేట ముంచుతున్నాయి. ఆక్వా రైతుల చేపలు, రొయ్యలకు ధర కల్పించి.. ఆదుకోవాలి. నాణ్యమైన సీడ్‌, ఫీడ్‌ సరఫరా చేయాలి. విద్యుత్‌ రాయితీ పునరుద్ధ్దరించాలి.

5

  • సముద్రమూ వారికే..

మత్స్యకారుల నివాస ప్రాంతమైన తీరమే కాదు, వారికి జీవనాధారమైన సముద్రం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ-సిఎఎ (అమెండ్‌మెంట్‌) బిల్లు -2023.. సాధారణ మత్స్యకారులకు ప్రాణాంతకంగా మారనుంది. ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం. 2005-06లో 24,386గా ఉన్న సాధారణ బోట్ల (నాన్‌ మోటరైజ్డ్‌) సంఖ్య 2015-16 నాటికి 17,837కు తగ్గింది. గత ఏడాదికి మరో పదివేల బోట్లు తగ్గి ఉంటాయని అంచనా. వీటి స్థానంలో తొలుత మోటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. మెకనైజ్డ్‌ బోట్లకు లక్షల రూపాయల్లో పెట్టుబడులు అవసరమైంది. లాభాలు భారీగా వస్తుండటంతో కార్పొరేట్‌ శక్తులు ఈ రంగంపై కన్నేశాయి. వలల సైజు మార్చి, సముద్రాన్ని ఊడ్చేయడం మొదలుపెట్టాయి. డీప్‌ సీ ఫిషింగ్‌కు కేంద్రం అనుమతి ఇవ్వడంతో భారీ వెజల్స్‌ రంగప్రవేశం చేశాయి. వీటన్నింటి ఫలితంగా చిన్న మత్స్యకారులు మామూలు బోట్లలో వేటకు వెళ్లినా చేపలు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో వీరు పెద్ద బోట్లపైన కూలీలుగా మారారు. ఇది చాలదన్నట్లు తాజాగా తీసుకువచ్చిన సిఎఎ బిల్లులో కోస్టల్‌ రెగ్యులేటరీ నిబంధనలను ఎత్తివేశారు.
బ్లూ ఎకానమి, సముద్ర ఆధారిత టూరిజం, డీప్‌ సీ మైనింగ్‌ ఇలా రకరకాల పేర్లతో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. దీంతో కొన్ని సంవత్సరాల వరకు మత్స్యకారులకు కన్నతల్లిలా కడుపునింపిన గంగమ్మ ఇప్పుడు కార్పొరేట్ల ఖజానా నింపే వనరుగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే సముద్రంలోంచి చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే సముద్రాన్ని, సముద్రతీరాన్ని, మత్య్సకారులను కాపాడుకునే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిది!

7

➡️