యువ రైతు మరణంపై విచారణ జరపాలి
ఢిల్లీ అసెంబ్లీ నివాళి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం సుకున్నాయి. రెండు రోజులపాటు పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోనే ఉండనున్నారు. ఈ విషయాన్ని రైతు నేతలు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం నిర్ణయం వెలువరిస్తామని ఈ సందర్భంగా రైతులు వెల్లడించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతోపాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్ను బుధవారం ఉదయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్-హర్యానా సరిహద్దులో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఈ దాడిలో ఒక యువ రైతు మరణించాడు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజులపాటు ఖనౌరీ, శంభు సరిహద్దుల్లోనే ఉండి ఆందోళన చేయనున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణపై ఫిబ్రవరి 23 శుక్రవారం సాయంత్రం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని తెలిపారు. సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. యువ రైతు మరణంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీ అసెంబ్లీ నివాళి అర్పించింది.