ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబయిలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. గత ఏడాది మార్చిలో సల్మాన్ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబయి పోలీసులు.. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోరు, గోల్డీ బ్రార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోరుల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోరు వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై ఆయనకు మెయిల్లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. 2023 ఏప్రిల్లోనూ ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ‘ఎక్స్’ గ్రేడ్ భద్రతను వై ప్లస్ అప్గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్కు నిత్యం భద్రతగా ఉంటున్నారు.