కాజీపేట : కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డట్లు తెలిపారు. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయని.. దీంతో పలు బోగీలు మంటల్లో కాలిపోయాయని తెలిపారు. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.