ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడింది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. గెలుపు కోసం అభ్యర్థులు రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. రోజుకు మూణ్నాలుగు ప్రాంతాలకు తక్కువ కాకుండా పర్యటిస్తున్నారు. మరోవైపు వారి వారసులు ప్రచార బరిలో దిగారు. తండ్రులకు మద్దతు కూడగడుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.తండ్రి గెలుపునకు కుమార్తెల ప్రచారం విజయనగరం టౌన్ : వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గెలుపునకు ఆయన కుమార్తెలు డాక్టర్ సంధ్య, డిప్యూటీ మేయర్ శ్రావణి, విస్తృత ప్రచారం చేస్తున్నారు. నగరంలోని అన్ని డివిజన్లలోనూ ఇంటింటికీ వెళ్లి తన తండ్రిని గెలిపించాలని కోరుతున్నారు. తాజాగా శుక్రవారం నగరంలోని 46వ డివిజన్ కె.ఎల్ పురం ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. అంతకుముందు ఆయన కుమార్తె సంధ్య, అల్లుడు నాగ అభిషేక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమెరికా నుండి నగరానికి వచ్చిన వారిరువురు కోలగట్ల గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఐదేళ్లగా నగరంలో కోలగట్ల వీరభద్ర స్వామి చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు.
బడ్డుకొండ తనయుల ప్రచారం
ప్రజాశక్తి- డెంకాడ: భోగాపురంవైసిపితోనే రాష్ట్రంలో సువర్ణ పాలన సాధ్యమని ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైసిపి జోనల్ ఐటి విభాగం ఇంఛార్జి బడ్డుకొండ మణిదీప్ నాయుడు అన్నారు. మండలంలోని సింగవరం, నాతవలస గ్రామాల్లో మండల వైసిపి నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తనయుడు యువజన నాయకులు ప్రదీప్ నాయుడు రావాడ గ్రామంలో వైసిపి మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి రావాడబాబు, సర్పంచ్ పైడినాయుడు, నాయకులు సుందర హరీష్, వాసుబాబు, తాతయ్యలు, యర్రప్పలనారాయణ, భాను వాసుపల్లి రెయ్యుడు, బైరెడ్డి రమణ, చిన్నారావు, రాజారెడ్డి, వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మునాయుడు, డెంకాడ పిఎసిఎస్ చైర్మన్ రొంగలి కనక సింహాచలం, సర్పంచ్ పిట్ట అప్పారావు, నాయకులు సంచాన కృష్ణమూర్తి, భావన, గున్నాధరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బొత్స గెలుపు బాధ్యత.. సందీప్ భుజాన
మెరకముడిదాం : చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు బాధ్యతను ఆయన తనయుడు, ధీర ఫౌండేషన్ అధినేత డాక్టర్ బొత్స సందీప్ భుజానకెత్తుకున్నారు. నియోజకవర్గంలో నిత్యం విస్తృతంగా పర్యటిస్తూ, ప్రజలతో మమేకమవుతున్నారు. శుక్రవారం మండలంలోని గర్భాం, పెదమంత్రిపేట, చినమంత్రిపేట, బోడందరవలస, లెంకపేట గ్రామ పరిధిలో జరుగుతున్న ఉపాధి పనుల వద్దకు వెళ్లి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వేతన దారులతో మాట్లాడుతూ మీ మధ్యలో ఉంటూ, మీ బాధలను, కష్టాలను తెలుసుకొని సమస్యలను పరిష్కరించే వ్యక్తి బొత్స సత్యనారాయణను, ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ను ఫ్యాన్ గుర్తిపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిత్యం మనకు అందుబాటులో ఉండి మనలను ఆదుకొనే వ్యక్తిని మాత్రమే ఎన్నికోవాలి కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే తట్ట బుట్ట సర్దుకొని వెళ్లిపోయే వ్యక్తులు మనకు వద్దని చెప్పారు. నియోజకవర్గం మొత్తం బొత్స, బెల్లాన ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిన సంగతిని గుర్తు చేశారు. ఈ సంక్షేమ పథకాలు మీ ఇంటి వద్దకే రావాలంటే ముఖ్యమంత్రిగా జగన్ మోహన రెడ్డిని మరోసారి గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎస్వి రమణరాజు, పప్పల కృష్ణ మూర్తి, బూర్లె నరేష్, సింగారపు రామకృష్ణ, సత్తారు జగన్ మోహనరావు, సత్తారు శ్రీను, కందుల మల్లికార్జునరావు, చినబాబు, మండల సత్యనారాయణ, బాలి బంగారునాయుడు, బాలి మహేష్ తదితరులు పాల్గొన్నారు.