ఇంజనీరింగ్ వర్కర్ సమస్యలు పరిష్కరించాలి

Feb 8,2024 22:59

ప్రజాశక్తి – రేపల్లె
మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్థానిక చంద్రమోళి పార్కులో ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం గురువారం నిర్వహించారు. డి ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొటున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో యూనియన్ (సీఐటీయు) ప్రధాన కార్యదర్శి ఎం రవిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం సరైన వేతనాలు అమలు చేయకపోవటం వల్ల నష్టపోతున్నట్లు చెప్పారు. తమ సమస్యలు పరిష్కారం కొరకు ప్రభుత్వ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ దృష్టికి ఇంజనీరింగ్ కార్మికుల సర్వీస్, ఇప్పుడు ఇస్తున్న వేతనాలు, ఇతర సమస్యలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ కార్మికులకు రూ.21,500 వేతనం చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ప్రభుత్వానికీ సిపార్సు చేయాలని కోరారు. కంప్యూటర్ ఆపరేటర్లు, పార్కుల్లో పనిచేసే వాళ్ళకి, మేస్త్రిలు, విద్యుత్తు, మంచినీళ్లు విభాగంలో పనిచేస్తున్న స్కిల్డ్ వర్కర్లందరికీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని కోరారు. ఇంజనీరింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని రాష్ట్రంలో కొన్నిచోట్ల ఒత్తిడిచేయటం వల్ల నిరంతరం భయాందోళనలో ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. సమావేశంలో ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ మణిలాల్, కోశాధికారి కె రాఘవేంద్రరావు, బి యువరాజు, వి శ్రీనివాసరావు, ఎ సుబ్బారావు పాల్గొన్నారు.

➡️