ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :సార్వత్రిక ఎన్నికల వేళ బాహాటంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ‘వికసిత్ భారత్’ పేరిట పంపిస్తున్న వాట్సాప్ సందేశాలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు స్పందించింది. ఈ సందేశాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మైబైల్ వినియోగిస్తున్న పౌరులకు, విదేశాల్లోని భారతీయులకు మోడీ కార్యాలయం నుంచి వాట్సాప్ సందేశాలు పంపడం వివాదస్పదమైన సంగతి విదితమే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇసి చర్యలకు ఉప క్రమించింది. వాట్సాప్లో వికసిత్ భారత్ పేరుతో మెసేజ్లను తక్షణమే ఆపాలని గురువారం కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందన్న విషయాన్ని గుర్తు చేసింది. అయినా, వికసిత్ భారత్ మెసేజ్లు రావడంపై కాంగ్రెస్ తదితర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.