న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికల కమిషన్ (ఇసి) మార్పులు చేసింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగియనున్నందున కౌంటింగ్ తేదీని జూన్ 4కి బదులుగా జూన్ 2కు మార్పు చేసినట్లు ఇసి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న చేపట్టనున్నట్లు శనివారం ప్రకటించిన ఇసి, ఆదివారం ఈ మేరకు మార్పులు చేసింది. ఆ రెండు రాష్ట్రాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.