- ‘చలో విజయవాడ’ వెళ్లనీయకుండా పోలీసుల నిర్బంధం
ప్రజాశక్తి- యంత్రాంగం : ‘చలో విజయవాడ’కు వెళ్లనీయకుండా విజయనగరం జిల్లాలో యుటిఎఫ్ నాయకులను, ఉపాధ్యాయులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పలు జిల్లాల్లో ఉపాధ్యాయులకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు, పిఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాకు యుటిఎఫ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్ల్లాలో పలువురు యుటిఎఫ్ నాయకులను, ఉపాధ్యాయులను పాఠశాలల్లోకి వెళ్లి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. విద్యార్థులకు పాఠాలు భోదించాల్సి ఉందని, పాఠశాలలోకి వచ్చి అరెస్టు చేయాలని చూడడం సరికాదని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, పోలీసులు బయటకు వచ్చేసి పాఠశాల బయట కాపు కాశారు. పాఠశాల ముగిసిన అనంతరం బయట వచ్చిన యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరిని రామభద్రపురంలోనూ, యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ప్రసన్నకుమార్ను ముచ్చర్లవలసలోనూ, ఉపాధ్యాయులు టి.స్వామినాయుడు, పి.సత్యనారాయణలను గొల్లపల్లి, పాత బొబ్బిలిలోనూ అరెస్టు చేసి బొబ్బిలి స్టేషన్కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు కర్నూలు కలెక్టరేట్ వద్ద బుధవారం సాయంత్రం ధర్నా చేశారు. అక్కడికి పోలీసులు వచ్చి విజయవాడ ధర్నాకు వెళ్లవద్దంటూ యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్ కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటిల్తో పాటు పలువురి నాయకులకు నోటీసులు ఇచ్చారు. అనంతపురంలో పలువురు యుటిఎఫ్ నాయకులకు, ఉపాధ్యాయులకు పోలీసులు మంగళవారమే ముందస్తు నోటీసు అందజేసి విజయవాడ వెళితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పోలీసులు పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చారు. యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తికి అత్తిలిలో, జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజుకు భీమవరంలో, ప్రధాన కార్యదర్శి ఎకెవి రామభద్రానికి పాలకొల్లులో పోలీసులు 41 ఎ నోటీసులు అందజేశారు. మరో 50 మంది ఉపాధ్యాయులకు, యుటిఎఫ్ నాయకులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చారు. యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తికి అత్తిలిలో, జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజుకు భీమవరంలో, ప్రధాన కార్యదర్శి ఎకెవి రామభద్రానికి పాలకొల్లులో 41 ఎ నోటీసులు అందజేశారు. మరో 50 మంది ఉపాధ్యాయులకు, యుటిఎఫ్ నాయకులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు.