పల్లె ప్రజలకు తప్పని ఎండ తీవ్రత
ప్రజాశక్తి-రామచంద్రపురం : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పల్లె ప్రాంతాలు సైతం వేడెక్కిపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి పల్లెల పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పచ్చని చెట్లతో నిత్యం చల్లగా ఉండే గోదావరి జిల్లాలు గత మూడు రోజులుగా కాస్తున్న ఎండలకు అల్లాడిపోతున్నాయి. ఉదయం 11 గంటల నుండి ఎండ తీవ్రత పెరిగి వడగాలుపులు వీస్తున్నాయి. దీనితో ఉక్కపోత మొదలై సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్రమైన చెమటలు పట్టి ఎండ వేడిమికి తాళలేని పరిస్థితి ఏర్పడుతుంది. వృద్ధులు చిన్నపిల్లలు ఈ ఎండలకు తట్టుకోలేక మరింత ఇక్కట్లకు గురవుతున్నారు. వడగాల్పులు వీచే అవకాశం ఉండటం వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్లేటప్పుడు టోపీలు ధరించాలని, వడదెబ్బ తగలకుండా మంచినీరు ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం వరకు పల్లెల్లోని రోడ్ లు కూడా నిర్మాణస్యంగా ఉండి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. చల్లని ప్రాంతాల్లో ఉండాలని, కనీసం ఐదు లీటర్ల మంచినీరు వేసవిలో తీసుకోవాలని వైద్యుల సూచిస్తున్నారు.