డా|| జ్యోతి జీవితం స్ఫూర్తిదాయకం

doctor siripurapu jyothi profile article

డాక్టర్‌ సిరిపురపు జ్యోతి గొప్ప మానవతావాది. ఎనస్తీషియా వైద్యురాలి (ఎనస్తీషియాలజిస్ట్‌)గా సుపరిచితు రాలైన ఆమె నిస్వార్థ సేవల గురించి ఉయ్యూరు ప్రాంతంలో తెలియని వారంటూ లేరు. వృత్తి లోనూ, ప్రవృత్తిలోనూ మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి ఆమె. తన గురించి కాక ఇతరుల కష్టసుఖాల గురించి ఎక్కువగా ఆలోచించేది. పేదలకు విద్య, వైద్య పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టింది కాబట్టే ఆమె ఇలా జీవించగలిగిందని నా నమ్మకం. సామాజిక స్పృహతో నిత్యం పేదలకు చేయూతనిచ్చే ఆమె క్యాన్సర్‌తో పోరాడి ఇటీవలె మరణించింది. ఆమె మరణం ఆప్తులకే కాదు పేదలందరికీ తీరని లోటు. మరణానంతరం కూడా కొంతమంది మహనీయులుగా సమాజంలో అలా మిగిలిపోతారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న మనిషి ఆమె.నాగళ్ల రాజేశ్వరమ్మ, జానకి రామయ్యల ఏకైక కుమార్తె జ్యోతి. బాల్యం నుండి అల్లారు ముద్దుగా బంధువులు, ఇరుగు పొరుగు ఆలనా పాలనలో పెరిగింది. అమ్మ ఎప్పుడూ తన దగ్గరే ఉండాలని కోరుకునేది. ‘నా 12 ఏళ్ల వయసులో చదువు కోసం ఫిరంగిపురం పంపుతున్న రోజున నేను వెళ్లే వరకు నాతో ఉండమని అమ్మను అడిగాను. కానీ…నాకు మహిళా సంఘం మీటింగ్‌ ఉంది, నాన్నకు కూడా నువ్వే భోజనం పెట్టి వెళ్ళమని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. నా వయసు పెరిగే కొద్దీ అమ్మ చేస్తున్న ప్రజాసేవ గురించి అర్ధమయింది. బంధువులు, ఇరుగుపొరుగువారు ‘భర్తను, పిల్లను పట్టించుకోకుండా మీటింగ్‌లంటూ వెళుతుంది’ అంటే అస్సలు సహించేదాన్ని కాదు. మా అమ్మ ఆశయం చాలా గొప్పదని వారితో వాదించేదాన్ని’ అంటూ తన తల్లి గురించి మాతో ఎప్పుడూ చెప్తుండేది. ఆ మాటలు మాలో ఎంతో స్ఫూర్తిని నింపేవి.

మహనీయుల మధ్యన…

స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలం అది. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో స్వతంత్ర భావాన్ని రగుల్కొలిపింది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటూనే మరోవైపు రాజా రామ్మోహన్‌ రారు, గురజాడ, వీరేశలింగం వంటి సంఘసంస్కర్తల నాయకత్వంలో సాంఘిక దురాచారాలు, సతీసహగమనం, బాల్యవివాహాలు, వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలలో పాల్గొనేవారు. ఆడవాళ్లు గడప దాటి బయటకు వెళ్లకూడదని ఆంక్షలు నడుస్తున్న కాలంలో కడియాల గోపాలరావు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మానికొండ సుబ్బారావు వంటి నేతలు మహిళలను చైతన్య పరిచి 1936లో కృష్ణా జిల్లా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలపై పోరుబాట పట్టించిందీ సంఘం. మానికొండ సూర్యావతి, నాగళ్ల రాజేశ్వరమ్మ, వల్లభనేని సీతామహాలక్ష్మి, చండ్ర సావిత్రీదేవి, డా||అచ్చమాంబ తదితరులు చురుకైన పాత్ర వహించారు. ఆ నాటి నుండి జరిగిన పోరాటాలే తర్వాత కాలంలో మహిళలకు అనేక హక్కులను అందించాయి. అలాంటి వారి మధ్య పెరిగి, అభ్యుదయ భావాలను అందిపుచ్చుకున్న మానవతావాది డా||జ్యోతి. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన ఓ సమావేశానికి రాజేశ్వరమ్మ గారు హాజరయ్యారు. అప్పుడే నాకు ఆమెతో పరిచయం. అప్పటి నుండి ఆమెను ఆప్యాయంగా మామ్మ అని, డా|| జ్యోతిని అక్క అని పిలిచేదాన్ని.

స్ఫూర్తి నింపాయి…

తన తల్లి జైలు, రహస్య జీవితం అనుభవించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లి తాను నమ్మిన మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతానికి చివరి దశ వరకు కట్టుబడి ఉండటం జ్యోతిలో స్ఫూర్తిని నింపాయి. ‘ఎక్కడ ఉన్నా నా గురించి, చదువు గురించి ఆందోళన పడేది. నా చదువు విషయంలో అమ్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకోనేది. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో మెడిసిన్‌ చదివేటప్పుడు మా ఇంట్లో పని చేస్తున్న రాములును నాకు సాయం చేసేందుకు ఊరి నుండి పంపింది. అప్పట్లో నేను నా క్లాస్‌మేట్‌ జగత్‌ను ఇష్టపడ్డాను. వివాహం చేసుకుంటానని అమ్మతో, సూర్యావతి, సుబ్బారావు గార్లతో చెప్తే వారే నాన్నను ఒప్పించి 1965లో మా వివాహం ఘనంగా జరిపించారు. కానీ 1967లో డాక్టర్‌ జగత్‌ అనారోగ్యంతో మరణించారు. దాంతో చాలా కుంగిపోయాను’ అంటూ అప్పుడప్పుడు మాతో చెప్పుకొని బాధపడేది.

ఆదాయంలో కొంత భాగం పేదలకే…

తర్వాత ఎనస్తీషియాలజీ చేయటానికి జ్యోతి ఇంగ్లాండ్‌ వెళ్లింది. అనంతరం అమెరికా, ఇంగ్లాండు, దుబారు, అబుదాబి మొదలైన దేశాల్లో వైద్యురాలిగా పని చేసింది. 1977లో తల్లిదండ్రుల ప్రోద్భలంతో డాక్టర్‌ ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. ఇండియా వచ్చి హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ కొనసాగించింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకునేందు కు సొంతూరైన కాటూరు వచ్చి అక్కడి నుండే ఉయ్యూరు, కానూరు, విజయవాడ హాస్పిటళ్లలో ఎనస్తీషియాలజిస్టుగా వైద్యాన్ని అందించేది. వైద్యురాలిగా తనకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పేద రోగుల మందులు, ఫీజులకు ఉపయోగించేది. తన చివరి దశలోనూ పేదవారు ఎవరైనా వైద్య సహాయం కోసం వస్తే డాక్టర్‌ దగ్గరకు పంపడమే గాక ఒక్కో సందర్భంలో వారి ఫీజులు కూడా ఆమే చెల్లించేది. తన ఇంట్లో పని చేసే వారి పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది.

ట్రస్ట్‌ ఏర్పాటు…

తల్లి అనారోగ్యంగా ఉన్న సమయంలో జ్యోతి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఎలాంటి బెడ్‌సోర్సెస్‌ రాకుండా జాగ్రత్తపడింది. ఆ సమయంలోనే జ్యోతి క్యాన్సర్‌ బారిన పడింది. అయినా తన ఆరోగ్యం కన్నా తల్లి ఆరోగ్యాన్నే చూసుకుంది. అలా చివరి వరకు పేదల కోసమే పని చేసిన తల్లి రాజేశ్వరమ్మ 2016లో చనిపోయింది. ఓ డాక్టర్‌ అయ్యుండి కూడా తన ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం మాకు చాలా బాధగా అనిపించేది. తన తల్లి కోసమే జీవిస్తుందా అన్నట్టుగా ఉండేది. తన తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో వారి పేరుతో ఉయ్యూరులో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి ఆఫీసు నిర్మాణానికి రూ.30 లక్షలు ఖర్చుపెట్టింది. గత 2 సంవత్సరాల నుండి టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌, సాంస్కృతిక కార్యక్రమాల శిక్షణ, సెమినార్లు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.

తన తర్వాత కూడా…

క్యాన్సర్‌ వ్యాధితో చివరి దశలో వుండగా… తన అకౌంట్‌లో వున్న డబ్బుతో ఉయ్యూరులో నాగళ్ళ రాజేశ్వరమ్మ, జానకి రామయ్య విజ్ఞాన కేంద్రానికి కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలన్న ఆఖరి కోరికను వెల్లడించింది. దానిపైన వచ్చే వడ్డీని పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వృత్తి శిక్షణా కేంద్రాలు నిర్వహించాలని ఆమె కాంక్షించింది. ఉయ్యూరు ప్రాంతంలో రాజేశ్వరమ్మతో పాటు జ్యోతి చేసిన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కుటుంబ సభ్యుల కోరిక మేరకు డాక్టర్‌ జ్యోతి చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి రెండు ట్రస్టులు నిర్వహించాలన్న నిర్ణయం జరిగింది. మనుషులు పుడతారు, పోతారు. ఈ రెండిటి మధ్య జీవితా న్ని ఎలా గడిపారు, చుట్టూ ఉన్న సమాజానికి తమ వంతుగా ఏ విధంగా తోడ్పడ్డారనేదే ముఖ్యం. అలా తోటివారి మేలు కోసం కడదాకా తపించిన జ్యోతి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదా యకం. తల్లి రాజేశ్వరమ్మ ఆశయాన్ని, ఆదర్శాన్ని తుది వరకు పాటించి, తన తర్వాత కూడా పేదలకు సేవలు కొనసాగాలని కోరుకున్న డా||జ్యోతి గొప్ప మానవతావాది, ధన్యజీవి.

(కృష్ణా జిల్లా కాటూరు గ్రామంలో నేడు డా|| జ్యోతి సంతాప సభ)

  • వ్యాసకర్త – కె స్వరూపరాణి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు
➡️