27న భీమిలిలో సభలో సిఎం జగన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం : మంత్రి బొత్స

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్‌ నాయకత్వంలో ఈనెల 27న భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్‌ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి కోరారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ కేడర్‌ ప్రాంతీయ సమావేశానికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో సిఎం జగన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. వైసిపి పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని..చేసిన పనులు ప్రజలకు తెలియజేయాలన్నారు. వైసిపి ఎమ్మేల్యే టిక్కెట్‌ కోసం పది మంది ఆశావాహులు ఉండవచ్చని.. కానీ నియోజకవర్గానికి ఓక్కరికే టిక్కెట్‌ వస్తుందన్నారు. పార్టి నిర్ణయం తీసుకున్న తరువాత మనం కట్టుబడి పనిచేయాలన్నారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు మనమంతా సమాయత్తం అవ్వాలన్నారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ , 5 ఎంపి స్థానాలను గెలిపించుకొవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి అత్యధిక స్థానాలు గెలవాలన్నారు. 27న భీమిలిలో జరగనున్న సభలో ప్రతీ పదవుల్లో ఉన్న నేతలు , కార్యకర్తలు, ప్రతి సచివాలయం నుంచి గృహాసారదులు , క్రియాశీల కార్యకర్తలు , పార్టీ సానుభూతిపరులు పాల్గొనాలన్నారు.

➡️