ముంబయి : ఇండియా ఫోరంలో విభేదాలను త్వరలోనే పరిష్కరిస్తామనిఎంపి, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో సీట్ల ఒప్పందం వంటి కీలక సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ నేతలు యత్నిస్తున్నారని అన్నారు. కొల్హాపూర్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బిజెపిని గద్దె దించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ఆలస్యం కాలేదని అన్నారు. అన్ని పార్టీలు కలిసి కట్టుగా పనిచేయాలని ముందుగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ఫోరంలోని మెజారిటీ పార్టీలు తమ రాష్ట్రాలకే పరిమితమయ్యాయని, ఈ పార్టీలన్నీ తమ రాష్ట్రాల్లోని ఇతర మిత్రపక్షాలతో కలిసి కూర్చోవాలని నిర్ణయించామని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రెండు రాష్ట్రాల్లో ఇండియా ఫోరంలోని ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని అన్నారు. సాధ్యమైనంత త్వరలో విభేదాలు ఉన్న రాష్ట్రాల వెలుపల నుండి సీనియర్ నేతలు సమస్యలను పరిష్కరించేందుకు యత్నిస్తారని అన్నారు.