కుటుంబాలపై అప్పుల భారం

Apr 10,2024 07:46 #Business, #Loans
  • తగ్గిన పొదుపు సామర్థ్యం
  • 47 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరిక
  • మోతిలాల్‌ ఓస్వాల్‌ రిపోర్ట్‌

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రజల పొదుపు సామర్థ్యం పడిపోవడం.. అప్పుల భారం పెరగడంతో దేశంలో ఆర్థిక సంక్షోభ చాయలు నెలకొన్నాయి. బిజెపి ప్రభుత్వ విధానాలతో ప్రజల పొదుపు సామర్థ్యం దాదాపు ఐదు దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. ఆదాయాలు, పొదుపు తగ్గడం రుణాల భారం పెరగడంతో భారత కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయిందని ఓ కీలక సంస్థ రిపోర్ట్‌లో తేలింది. 2023 డిసెంబర్‌ ముగింపు నాటికి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో కుటుంబాల అప్పు స్థాయి 40 శాతానికి చేరిందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోతిలాల్‌ ఓస్వాల్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. మరోవైపు పొదుపు సామర్థ్యం జిడిపిలో 5 శాతానికి దిగజారి.. అతి కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) సెప్టెంబర్‌ 2023లోని అంచనా ప్రకారం.. 2022-23లో కుటుంబాల నికర విత్త పొదుపు స్థాయి జిడిపిలో 5.1 శాతానికి పడిపోయింది. ఇది 47 ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. దీన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించడం మరింత విమర్శలకు దారి తీసింది. నివాసాలు, వాహనాలు వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకోవడం వల్ల కుటుంబాలు గతంలో కంటే తక్కువ ఆర్థిక ఆస్తులను కలిగి ఉన్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ప్రకటించిన 2022-23 జాతీయాదాయం సవరించిన అంచనాల్లో.. కుటుంబాల పొదుపు స్థాయి జిడిపిలో 5.3 శాతానికి తగ్గి.. 47 ఏళ్లలోనే కనిష్ట స్థాయికి దిగజారింది. మరోవైపు కుటుంబాల అప్పుల స్థాయి జిడిపిలో 38 శాతానికి ఎగిశాయి. 2020-21లో ఇది రికార్డ్‌ స్థాయిలో 39.1 శాతంగా ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలకు సంకేతం.
గుదిబండగా వ్యక్తిగత రుణాలు..
అవసరాల కోసం తీసుకుంటున్న వ్యక్తిగత రుణాలు కుటుంబాలకు గుదిబండగా మారుతున్నాయి. ”డిసెంబర్‌ 2023 నాటికి కుటుంబాల అప్పులు జిడిపిలో 40 శాతానికి పెరిగి కొత్త గరిష్ట స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల డేటా ఆధారంగా అన్‌సెక్యూర్డ్‌ వ్యక్తిగత రుణాలు వేగంగా పెరిగి కుటుంబాల అప్పులను మరింత పెంచనున్నాయి. ఆ తర్వాత సురక్షిత రుణాలు, వ్యవసాయ రుణాలు, వ్యాపార రుణాలు వేగంగా పెరుగుతాయి.” అని మోతీలాల్‌ ఓస్వాల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌లు నిఖిల్‌ గుప్తా, తనీషా లధా విశ్లేషించారు.
మోతిలాల్‌ ఓస్వాల్‌ రిపోర్ట్‌ ప్రకారం.. 2022-23లో ప్రధానంగా ఆదాయాల వృద్థిలో బలహీనతలు కుటుంబాల పొదుపు శక్తిని దెబ్బతీశాయి. అదే విధంగా వినియోగ వ్యయాలు, భౌతిక పొదుపు పెరుగుదల సేవింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. 2023-24లోనూ ప్రయివేటు వినిమయం, కుటుంబాల పెట్టుబడుల్లో వృద్థి బలహీనంగా కనబడింది. కుటుంబాల వార్షిక అప్పులు 5.8 శాతానికి ఎగిసే అవకాశం ఉందని మోతిలాల్‌ ఓస్వాల్‌ పరిశోధకులు అంచనా వేశారు. ఇది స్వాతంత్య్ర వచ్చిన తర్వాత అత్యధికంగా నమోదు కానుందన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్‌ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అప్పులూ అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. వాటి చెల్లింపులకు ప్రజలపై అనేక భారాలు మోపడం, ధరలు పెంచడం, హెచ్చు నిరుద్యోగం, ప్రజల ఆదాయాలు పడిపోవడం తదితర అంశాలు కుటుంబాలను అప్పుల పాలు చేస్తున్నాయనే విమర్శలు అనేకం ఉన్నాయి.

➡️