2023లో 53 లక్షల భారతీయ ఆన్‌లైన్‌ ఖాతాల డేటా ఉల్లంఘన

న్యూఢిల్లీ : గతేడాదిలో మొత్తంగా 53 లక్షల భారతీయ ఆన్‌లైన్‌ ఖాతాలు డేటా ఉల్లంఘనకు గురయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. ప్రైవేట్‌ వర్చువల్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ సర్ఫ్‌షార్క్‌ సోమవారం వార్షిక నివేదికను విడుదల చేసింది. ‘విశ్వసనీయమైన, సున్నితమైన డేటా అనధికార తృతీయ పక్షానికి వెల్లడైంది.” అని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్‌ సర్వీసుల కోసం రిజిస్టర్‌ కావడానికి ఉపయోగించిన ఇ మెయిల్‌ అడ్రస్‌లను లీక్‌ చేయడం జరిగింది. పాస్‌వర్డ్స్‌, ఫోన్‌ నెంబర్లు, ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ అడ్రస్‌లు, జిప్‌ కోడ్‌లు, డేటా వంటి అదనపు సమాచారంతో ఈ ఖాతాలు లీకయ్యాయని ఆ నివేదిక తెలిపింది. 2023లో ప్రతి నిముషానికి దాదాపు 10 భారతీయ ఖాతాలు లీకయ్యాయని తెలిపింది. ప్రతి వెయ్యి ఖాతాల్లో నాలుగు ఉల్లంఘించబడ్డాయని పేర్కొంది. అత్యంత ఎక్కువగా డేటా ఉల్లంఘనలకు బాధపడిన దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. గతేడాది జనవరిలో భారతీయ దుస్తుల తయారీ సంస్థ కేవల్‌ కిరణ్‌ క్లోతింగ్‌ నుండి అత్యంత ఎక్కువగా డేటా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా 12,32,580 యూజర్‌ ఖాతాలు లీకయ్యాయి. రెండవది ఫర్నీచర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ అప్లయన్స్‌ రెంటల్‌ సర్వీస్‌ రెంటోమోజోలో ఏప్రిల్‌లో జరిగింది. 11,63,135 ఖాతాలు లీకయ్యాయి. 2022లో డేటా ఉల్లంఘనలో భారత్‌ ఏడవ స్థానంలో వుంది.

➡️