తెలంగాణ : తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. తమ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు అర కిలోమీటరు మేర జనాలు క్యూ కట్టారు. ఈ నెల 8న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించిన సంగతి విదితమే. ఇటీవల ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటలకు వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో.. ప్రజలు ముందుగానే పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ ముందు రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు, తమ సమస్యలు పరిష్కరించాలని లారీల యజమానులు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కోసం కొందరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లపై వినతులు ఇచ్చేందుకు ఎక్కువ మంది ప్రజలు తరలివచ్చారు.