న్యూఢిల్లీ : ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఆహారధాన్యాల పంపిణీకి ఉపయోగించే బస్తాలపై నరేంద్ర మోడీ చిత్రం ముద్రించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మోడీ చిత్రంతో కూడిన ప్రత్యేక సంచులను ముద్రించాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ యూనిట్లను ఆదేశించింది. రాజస్థాన్లోనే 13.29 కోట్ల సింథటిక్ బ్యాగులను ఆర్డర్ చేశారు. మోడీ చిత్రాన్ని ముద్రించేందుకు ఒక్కో బ్యాగ్కు అదనంగా రూ.12.37 కాగా.. నాగాలాండ్ ఒక్కో బ్యాగ్కు రూ.9.30 చొప్పున కాంట్రాక్ట్ ఇచ్చింది. తమిళనాడులో 1.14 కోట్ల బస్తాలకు టెండర్ పిలిచారు. రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ కటౌట్తో కూడిన సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేరళ తిరస్కరించింది. కోవిడ్-వ్యాక్సినేషన్ సర్టిఫికెట్పై ప్రధాని ఫోటోను ముద్రించడం ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలైన సంగతి తెలిసిందే.