తెలంగాణ : హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కరీంనగర్లో ఆయనపై కేసు నమోదయింది. ఈ నెల 7వ తేదీన కరీంనగర్లో కార్యకర్తలు, ముఖ్యనేతలతో కెటిఆర్, కౌశిక్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ … బిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామని అప్పుడు పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పోలీసులపై కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ … పట్టణానికి చెందిన ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులను కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఆశిష్ గౌడ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.