న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 475 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో సోమవారం 279 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా వల్ల నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. కర్ణాటకలో ముగ్గురు, చత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కరోనా వైరస్కి బలయ్యారు. దీంతో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,33,402కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.91 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.