ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ జిల్లా దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగనంపూడి టోల్ ప్లాజా వద్ద ఆర్టిసి బస్సులో గంజాయి పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ప్రత్యేక స్క్వాడ్ బృందాలతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వైపుగా వస్తున్న ఆర్టిసి బస్సులో తనిఖీ చేశారు. బస్సులో 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న భార్యాభర్తలు నాగరాజు, భారతీలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయితో పట్టుబడిన నిందితులది నర్సీపట్నం సమీపంలోని కెడి.పేటగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.