- అనుమతినిచ్చిన ఐటి అప్పిలియేట్ ట్రిబ్యునల్
- ప్రజాస్వామ్యంపై దాడి : మల్లికార్జున ఖర్గే
- కాంగ్రెస్కు ప్రజా బలం ఉంది : రాహుల్ గాంధీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన అనుబంధ సంఘాలకు చెందిన తొమ్మిది అకౌంట్లను ఆదాయ పన్నుశాఖ సీజ్ చేసింది. తమ శాఖ 2018-19లో పంపిన నోటీసులకు సదరు అనుబంధ సంఘాలు సరైన స్పందన ఇవ్వకపోగా.. జరిమానా కూడా చెల్లించలేదని, దీంతో అకౌంట్లు సీజ్ చేశామని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ విభాగాలకు సమాచారం పంపింది. దీంతో కాంగ్రెస్ ఐటి అప్పిలియేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఆదాయపు పన్ను సీజ్ చేసిన అకౌంట్లను ఉపయోగించుకునేందుకు ఐటి అప్పిలియేట్ ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది.
ప్రజాస్వామ్యంపై దాడి
కాంగ్రెస్కు చెందిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై లోతైన దాడి అని అన్నారు. అధికార మత్తులో ఉన్న మోడీ సర్కారు లోక్సభ ఎన్నికల ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు నగదు రూపంలో డిపాజిట్ చేసిన రూ.14.40 లక్షలకు, గతంలో ఐటిశాఖ ఏకంగా రూ.210 కోట్ల జరిమానా విధించిందని చెప్పారు. ఇప్పుడు ఈ చిన్నసాకుతో ఆదాయపు శాఖ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిందని ఆరోపించారు. ఈ అంశంపై సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఖర్గే స్పందించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత బిజెపి ఖాతాలు సీజ్ చేయాలని అన్నారు. ఇప్పటికే ఇందులో 95 శాతానికి పైగా నిధుల్ని బిజెపి జేబులో వేసుకుందని ఆరోపించారు.
కాంగ్రెస్ది డబ్బు కాదు.. ప్రజా బలం : రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీకి డబ్బు బలం కాదని, ప్రజల బలం ఉందని అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నియంతృత్వ బెదిరింపులకు కాంగ్రెస్ లొంగదని స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని అన్ని విధాలుగా పరిరక్షించేందుకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పోరాడుతారని చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ఒక నెల ముందు, ప్రతిపక్ష పార్టీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపట్టకుండా బిజెపి ఒక బలహీన చర్యలను ఎంచుకుందని పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కెసి వేణుగోపాల్ విమర్శించారు. బిజెపి ఎలక్టోరల్ బాండ్ స్కాంతో రూ.6,500 కోట్లు చెక్కు చెదరకుండా ఆ పార్టీ అకౌంట్లో మిగిలిపోయాయన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు ముందు ఉద్దేశపూర్వకంగా అకౌంట్ల సీజ్ జరిగిందని పార్టీ కోశాధికారి అజరు మాకెన్ విమర్శించారు.