సదస్సులో మాట్లాడుతున్న జెఎన్టియు ఉపకులపతి జివిఆర్ శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అనంతపురం
సదస్సులు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలకు నాంది పలుకుతాయని జెఎన్టియు ఉపకులపతి జివిఆర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం స్థానిక జెఎన్టియు ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఎస్వి.సత్యనారాయణ అధ్యక్షతన ఈ మెర్జ్-2కె 24 అనే జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలకు నాంది అవుతాయన్నారు. విద్యార్థులు తమ తమ చిన్న ఆలోచనలే రేపటి రోజున గొప్ప విషయాలకు నాంది పలుకుతాయన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టం, పవర్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిపిసియల్ ఇంటలిజెన్స్ విభాగాలు ముఖ్య పాత్ర పోసిస్తున్నాయన్నారు. రాబోవు కాలంలో ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. గౌరవ అతిథి మనోహర్ చేనేకల్, సీనియర్ ఇంజినీర్ లీడర్, జెడ్ ఎఫ్ కమర్షియల్ వెహికల్ సొల్యుషన్స్ లిమిటెడ్, హైదరాబాద్ (కళాశాల పూర్వ విద్యార్థి) మాట్లాడుతూ ఇన్సిట్యుట్, ఇండిస్టీల మధ్య సంబంధాలను మెరుగు పరుచుకుంటే విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగే అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు ప్లేస్మెంట్ అవకాశాలను అందిపుచ్చుకుని గొప్ప కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణ, ఇసిఇ విభాగాధిపతి జి.మమత, కోఆర్డినేటర్ డి.లలితకుమారి, ఆచార్యులు వి.సుమలత, పి.రమణారెడ్డి, భువనవిజయ, కెఎఫ్.భారతి, ఎ.పి.శివకుమార్, డి.విష్ణువర్ధన్, ఎం.రామశేఖర్రెడ్డి, కల్యాణి రాధ, ఆజిత, మాజీ ఆచార్యులు ఎం.ఎన్.గిరిప్రసాద్, స్టూడెంట్ కోఆర్డినేటర్ జాకీర్హుసేన్, వివిధ విభాగాధిపతులు, బోధన, బోధనేతర, ఎలక్ట్రానిక్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.