-ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
-వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి
ప్రజాశక్తి- వేంపల్లె/సింహాద్రిపురం (వైఎస్ఆర్ జిల్లా)భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలు తీర్చే పథకాలతో ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సంతృప్తి స్థాయిలో సుపరిపాలన కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సింహాద్రిపురంలో రూ36.03 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో పులివెందుల రూరల్ మండలం సింహాద్రిపురంలో వేర్వేరుగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పులివెందుల అర్బన్ డవలప్మెంట్ ఆథారిటీ (పాడా) అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా చోట్ల సిఎం జగన్ మాట్లాడుతూ గ్ర్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సంతృప్తికరంగా ప్రజలకు అందించేందుకు పడుతున్నామన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావు ఇవ్వకూడదనేదే ప్రభుత్వ సిద్ధాంతమని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపి అవినాష్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయరెడ్డి, కలెక్టర్ విజరురామరాజు తదితరులు పాల్గొన్నారు.