న్యూఢిల్లీ : అయోధ్యలో జరగనున్న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం లేదని కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. ఇది పూర్తిగా ”రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)/ బిజెపి”ల రాజకీయ కార్యక్రమని అభివర్ణించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీలతో పాటు లోక్సభ ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందినట్లు సమాచారం.
మతం అనేది వ్యక్తిగత అంశం. కానీ ఆర్ఎస్ఎస్ / బిజెపిలు అయోధ్య నిర్మాణాన్ని రాజకీయంగా మార్చాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. ఎన్నికల్లో లబ్థి పొందేందుకే బిజెపి అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ప్రారంభిస్తోందని ధ్వజమెత్తారు. 2019 సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి, శ్రీరాముని గౌరవించే లక్షలాది మంది ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలు గౌరవపూర్వకంగా బిజెపి/ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని తిరస్కరించారని జైరాం రమేష్ స్పష్టం చేశారు.