ప్రజాశక్తి – కాకినాడ
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రయివేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నూకరాజును ఎస్ఎఫ్ఐ బృందం కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందించింది. ఈ సందర్భం గా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇప్పటికే పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. కాకినాడ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యాలు వేసవి సెలవులు ఇవ్వకుండా విద్యార్థులును మానసికంగా వేధించడం దుర్మార్గమన్నారు. ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను క్లాస్లకు రాకపోతే ఫెయిల్ అయిపోతారని భయపెట్టి మానసికంగా వేధిస్తున్నారన్నారు. ఇంటర్మీడియట్ కాలెండర్ ప్రకారం మే 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. కావున తక్షణమే ఇంటర్మీడియట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని, సెలవులు ప్రకటించని విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నటువంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గోపాల్, ఆదర్శ కార్తీక్, రోహిత్ పాల్గొన్నారు.