సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ

Mar 31,2024 22:39 #Chandrababu Naidu, #pensions in AP

సిఎస్‌, ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గ్రామ సచివాలయం, ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు . రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు విడివిడిగా ఆదివారం లేఖలు రాశారు.రాష్ట్రప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నుండే పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. వృద్ధులు, వింతంతవులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పెన్షన్‌ మొత్తం చెల్లించాలని కోరారు. దీనికోసం సచివాలయ సిబ్బంది పెన్షన్‌ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లడానికి అనుమతించాలని, ఇందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. పెన్షన్‌ నిధులను రాష్ట్రప్రభుత్వం సిద్ధం చేయలేదనే వార్తలు వస్తున్నాయని తెలిపారు. అవసరమైన నిధులను వెంటనే అందుబాటులో ఉంచాలని కోరారు. గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5వ తేది మధ్య పంపిణీ ప్రక్రియ పూర్తిచేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని కోరారు.

➡️