ప్రజాశక్తి- బత్తలపల్లి (శ్రీసత్యసాయి జిల్లా) : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వైసిపి సీనియర్ నాయకులు, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన భార్య బత్తలపల్లి జడ్పిటిసి సభ్యులు కోటి సుధతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన బత్తలపల్లిలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో బిసిలకు న్యాయం జరగలేదన్నారు. 2019, 2024లో హిందూపురం ఎంపి టికెటు ఇస్తానని చెప్పి జగన్ మోసగించారని విమర్శించారు. ఆయన మాటలు విని ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం ఖర్చు చేశానన్నారు. తనతోపాటు ఎంపిటిసి సభ్యులు కోటి నరేష్ కుమార్, ఉప సర్పంచ్ కోటి గోపీనాథ్ కూడా వైసిపికి రాజీనామా చేసినట్లు తెలిపారు.