‘ఉక్కు’పై తేల్చాకే ప్రచారం

Apr 1,2024 08:34 #campaign, #Ukku
  • బిజెపి, టిడిపి, జనసేనకు బొత్స అల్టిమేటం
  • ప్రయివేటీకరణ లేదని కేంద్రం ప్రకటించాలి

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను విరమించుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే కూటమి కట్టిన టిడిపి, జనసేన, బిజెపిలు రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన వైసిపి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, రాష్ట్ర ప్రభుత్వం ఏనాడో దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని చెప్పుకొచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన టిడిపి, జనసేన పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రయివేటీకరణ చేసి తీరుతామని ప్రకటించిన బిజెపితో జతకట్టి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. ఉక్కును రక్షిస్తామని ప్రకటన చేయకుంటే ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ తిరగనివ్వబోరని గుర్తెరగాలన్నారు. స్థానికేతరులకు, లాబీయిస్టులుగా పనిచేసే వారికి టిడిపి సీట్లు కేటాయించారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం కూటమిలో చంద్రబాబు చేరలేదని, ఆయన కొడుకు రక్షణ కోసమే జతకట్టారని విమర్శించారు. ఈ సమావేశంలో వైసిపి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు పాల్గొన్నారు.

➡️